- వారిలో ఇద్దరు మహిళా రైతులు
- పంటలను తగులబెట్టిన ఇద్దరు రైతులు
ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలు చేతికందలేదు. పెట్టిన పెట్టుబడి వచ్చేలా లేదు. అప్పుల ఊబిలో కూరుకుపోవడంతో ముగ్గురు రైతులు ఆత్మహత్యకు చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని రేపల్లెవాడకు చెందిన పెద్దపల్లి శంకర్, ఆయన భార్య లక్ష్మి పది ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని పంట వేశారు. వర్షాలకు పత్తి మొక్కలు సరిగ్గా ఎదగకపోవడంతో పంట దిగుబడి తగ్గిపోయింది. కోతదశకు వచ్చిన వరి పంటలపై ఐదు రోజుల క్రితం అడవి పందులు దాడి చేసి ధ్వంసం చేశాయి. దీంతో లక్ష్మి(41) పురుగుల మందు తాగి మంగళవారం రాత్రి మృతి చెందింది.
జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలంలోని సముద్రాలకు చెందిన మహిళా రైతు తాటికొండ రేణుక(32) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని గుండ్లరేవు గ్రామానికి చెందిన ముక్తి అప్పారావు(37) అనే రైతు రెండెకరాల్లో పత్తి పంట వేశాడు. భారీ వర్షాలతో పంట దెబ్బతింది. బుధవారం పొలం వద్ద పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
కాగా, దీంతో జగిత్యాల జిల్లా రాయికల్ మండలం సింగర్రావుపేట గ్రామానికి చెందిన ఆకుల రాజేశం నాలుగెకరాల పంటకు బుధవారం నిప్పంటించాడు.ప్రభుత్వ సూచన మేరకు సన్నరకం వరి వేస్తే తనకు తీవ్ర నష్టం జరిగింద న్నాడు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఇసాయిపేట్లో రైతు చాకలి నర్సింలు తన ఎకరం 20 గుంటల భూమిలో వేసిన పంట పూర్తిగా దెబ్బతినడంతో నిప్పంటించాడు.
కాగా, సన్నరకం ధాన్యానికి మద్దతు ధర పెంచాలంటూ మెదక్ జిల్లా కొల్చారం మండలం రాంపూర్ వద్ద మెదక్-హైదరాబాద్ రహదారిపై రైతులు రాస్తారోకో చేశారు.
Courtesy Andhrajyothi