– మా రైతులకు గౌరవం లేకపోతే, మా పతకాలకు విలువ లేదు
– 40 మందికి పైగా క్రీడాకారులు అవార్డులు వెనక్కి
– స్పష్టం చేసిన క్రీడాకారులు
న్యూఢిల్లీ: రైతుల ఆందోళనకు మద్దతుగా 40 మందికి పైగా పంజాబ్ క్రీడాకారులు అవార్డులను తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకుంటారు. పద్మశ్రీ, అర్జున, ఖేల్రత్నా, ద్రోణాచార్య అవార్డులను వెనక్కి ఇచ్చారు. భారత మాజీ బాస్కెట్బాల్ క్రీడాకారిణి, అర్జున అవార్డు గ్రహీత సజ్జన్ సింగ్ చీమాతో పాటు 1980 మాస్కో ఒలింపిక్ బంగారు పతకం గెలుచుకున్నభారత హాకీ జట్టులో సభ్యులు గుర్మైల్ సింగ్, సురీందర్ సింగ్ సోధిలు కూడా అవార్డులు వెనక్కి ఇచ్చారు. ముగ్గురు బాక్సింగ్ దిగ్గజాలు గుర్బాక్స్ సింగ్ సంధు, కౌర్ సింగ్, జైపాల్ సింగ్ అవార్డులను వెనక్కి ఇచ్చారు. ”నేను, నా ముగ్గురు సోదరులు, బల్కర్ సింగ్ చీమా, కుల్దీప్ సింగ్ చీమా మరియు గుర్మీత్ సింగ్ చీమా, బాస్కెట్ బాల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాం. కపుర్తాలా సమీపంలోని ధబులియన్ గ్రామంలో 20 ఎకరాల భూమిని కలిగి ఉన్నమా తండ్రి సుర్జిత్ సింగ్ ప్రయత్నాల వల్ల మీమందరం జాతీయ, అంతర్జాతీయ కీర్తిని సాధించగలిగాం. ఒక రైతు దేశానికి మాత్రమే కాకుండా, ఆటగాళ్లకు కూడా ఆహారాన్ని అందిస్తాడు. ఈ పోరాటంలో మనమందరం వారితో ఉండాలి” అని 1982 ఆసియా క్రీడలలో భారత బాస్కెట్ బాల్ జట్టులో భాగమైన, పంజాబ్ పోలీస్ విభాగంలో ఎస్పీగా పదవీ విరమణ చేసిన 63 ఏండ్ల చీమా అన్నారు. 30 మందికి పైగా ఆటగాళ్ళు తమతో కలిసి ముందుకు వచ్చారు. పంజాబ్, విదేశాలల్లో ఉన్న ఆటగాళ్ళ నుండి తమకు ఫోన్కాల్స్ వస్తున్నాయి. మాజీ ప్రపంచ బాడీ బిల్డింగ్ ఛాంపియన్ ప్రేమ్ చంద్ డెగ్రా వంటి ఆటగాళ్ళు కూడా తమతో కలిశారు.
మాజీ రెజ్లర్, పద్మశ్రీ, అర్జున అవార్డు గ్రహీత కర్తార్ సింగ్ వంటి అనేక మంది తమ అవార్డులను తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ”మా రైతులు మా కుటుంబం. రైతులు నిరసన వ్యక్తం చేస్తుంటే, మేము కూడా వారితో ఉన్నామని అర్థం. రైతులను ఆపే విధానం టియర్ గ్యాస్ షెల్స్, నీటి ఫిరంగులను వారిపై కాల్చడం ప్రజాస్వామ్యంలో తీసుకోవలసిన చర్య కాదు. నిరసనలు పంజాబ్ రైతుల గురించి మాత్రమే కాదు” అని కర్తార్ అన్నారు. ”నా తండ్రి కర్నైల్ సింగ్ మా 20 ఎకరాల భూమిని ఎలా పండించారో నాకు గుర్తుంది. నా విద్యాభ్యాసం, శిక్షణకు తోడ్పడటానికి డబ్బు కూడా పంపించేవారు. మల్లయోధుడి బలం వెనుక, రైతు చేయి ఎప్పుడూ ఉంటుంది” ఆయన అన్నారు.
భారత మహిళా హాకీ జట్టు మాజీ కెప్టెన్ రాజ్బీర్ కౌర్, ఆమె భర్త గుర్మైల్ సింగ్ 1980 మాస్కో ఒలింపిక్స్ బంగారు పతకం గెలుచుకున్న భారత హాకీ జట్టులో సభ్యురాలు. 1982 ఆసియా ఆటల కాంస్య పతక విజేత బల్విందర్ సింగ్, 1975 హాకీ ప్రపంచ కప్ విజేత భారత హాకీ జట్టు సభ్యుడు హర్చరన్ సింగ్ బొపరారు, ఇతరులు కూడా వారి అర్జున అవార్డులను తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ”నేను కూడా ఒక వ్యవసాయ కుటుంబం నుండి వచ్చాను. నేను ఆటాడే రోజుల్లో నేను భారత హాకీ జట్టు కోసం ఆడనప్పుడు వ్యవసాయ సంఘం నిర్వహించిన అనేక టోర్నమెంట్లలో ఆడాను. రైతులు ఏదైనా చట్టవిరుద్ధం, తప్పు లాంటివి డిమాండ్ చేయడం లేదు. మా రైతులు గౌరవించబడకపోతే మా పతకాలు, పురస్కారాలు మాకు పనికిరావు” అని 1982 ఆసియా ఆటలలో బంగారు పతకం, 1986 ఆసియా క్రీడలలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న భారత జట్టులో సభ్యుడు కౌర్ అన్నారు.
మాజీ జాతీయ బాక్సింగ్ కోచ్ అయిన గుర్బాక్స్ సింగ్ సంధు తొలి ఒలింపిక్ పతకాన్నిసాధించిన ద్రోణాచార్య అవార్డు గ్రహీత. కౌర్ సింగ్ మాజీ ఆసియా గేమ్స్ (1982) బంగారు పతక విజేత పద్మశ్రీ, అర్జున అవార్డు గ్రహీత కాగా, 1986 ఆసియా గేమ్స్ రజత పతక విజేత జైపాల్ సింగ్ అర్జున అవార్డు గ్రహీత. 1980లో న్యూఢిల్లీలో జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్లో బాక్సింగ్ లెజెండ్ ముహమ్మద్ అలీతో పోరాడిన 71 ఏండ్ల కౌర్ సింగ్, పంజాబ్లోని సంగ్రూర్లోని ఖనాల్ ఖుర్ద్ గ్రామంలో నాలుగు ఎకరాల భూమిని కలిగి ఉన్నాడు. నిరసన తెలిపిన రైతులపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను చూసి ఆయన బాధపడ్డాడు. రైతులు రోడ్డు మీద ఉన్నంత వరకు అవార్డులు నాకు ఏమీ అర్ధం కాదు. 1970 ల చివరలో నేను భారత సైన్యంలో చేరడానికి ముందు, నా తండ్రి కర్నైల్ సింగ్ మా వ్యవసాయ భూమి నుండి వచ్చే ఆదాయంతో నా బాక్సింగ్కు మద్దతు ఇచ్చాడు. నా విజయాలన్నీ నా రైతు తండ్రి కృషి వల్లనే”అని కౌర్ సింగ్ అన్నారు.
1984 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్లో కౌర్ సింగ్ దేశానికి ప్రాతినిధ్యం వహించారు. అతని జట్టు సహచరుడు జైపాల్ సింగ్ 1984 ఒలింపిక్స్ కోసం భారత బాక్సింగ్ క్యాంప్లో సభ్యుడు. 63 ఏళ్ల జైపాల్ సింగ్ సంగ్రూర్ జిల్లాలోని రూప్ రోహిరా గ్రామంలో ఏడు ఎకరాల వ్యవసాయ భూమిని కలిగి ఉన్నారు. గత ఐదు నెలల నుండి రైతుల నిరసనలకు మద్దతుగా ఉన్నారు. ”బాక్సింగ్ ప్రారంభించే ముందు, నేను తరచూ మా తండ్రికి పొలంలో సహాయం చేసేవాడిణ్ని. నేను అతనితో పాటు మండిస్కు వెళ్లేవాణ్ని. అప్పటి నుండి చమురు ధర అనేక రెట్లు పెరిగినప్పటికీ, ఆ స్థాయిలో కనీస మద్దతు ధర పెరగలేదు. క్రీడలలో రాణించినందుకు అర్జున అవార్డు ఇవ్వబడింది. కాని నాలోని రైతు ఈ అవార్డును కేంద్ర ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు” అని జైపాల్ సింగ్ అన్నారు.
కొన్ని సంవత్సరాల పాటు మహిళా బాక్సర్లకు మార్గనిర్దేశం చేసే ముందు, రెండు దశాబ్దాలుగా భారత జాతీయ పురుష కోచ్గా పనిచేసిన గుర్బాక్స్ సింగ్ సంధు రైతులకు మద్దతుగా తన ద్రోణాచార్య అవార్డును తిరిగి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ”నా కోచింగ్ కెరీర్లో, వ్యవసాయ కుటుంబాల నుండి చాలా మంది బాక్సర్లు రావడాన్ని నేను చూశాను. మా కుటుంబాల కషి వల్ల, వ్యవసాయ సమాజం నుండి సహకారం వల్ల మేమంతా సాధించగలిగాం. గ్రామాల్లో వ్యవసాయ సంఘాలు అనేక స్థానిక టోర్నమెంట్లు నిర్వహిస్తాయి.
బాక్సర్లు, రెజ్లర్లకు ఆర్థికంగా మద్దతు ఇస్తాయి. ప్రభుత్వం రైతుల మాట వినాలి” అని లూధియానా జిల్లాలోని రారుకోట్లో వ్యవసాయ భూమిని కలిగి ఉన్న గుర్బాక్స్ సింగ్ సంధు అన్నారు. 2008లో తిరిగి ఒలింపిక్ పతకం సాధించిన తొలి భారతీయ బాక్సర్గా విజేందర్ సింగ్ నిలిచినప్పుడు సంధు జాతీయ కోచ్. అతని పదవీకాలంలో అప్పటి అపూర్వమైన ఎనిమిది మంది భారతీయ బాక్సర్లు 2012 లండన్లో జరిగిన ఒలింపిక్స్కు అర్హత సాధించారు. ”ఈ అవార్డు కంటే నా తోటి రైతుల దుస్థితి ఇంకా ఎక్కువ. అవార్డును తిరిగి ఇవ్వడం ద్వారా భారీ ధైర్యం ఇచ్చినట్లు అవుతుంది. నాకు ఒత్తిడి లేదని నేను భావిస్తున్నాను” అని సంధు అన్నారు.
Courtesy Nava Telangana