లైంగికదాడి చేసి.. ఊపిరితిత్తులు తీసి!

Published on

యూపీలో ఆరేండ్ల బాలికపై దారుణం
మూఢ నమ్మకాలకు బలైన చిన్నారి

లక్నో : మూఢ నమ్మకాలతో పాటు సామూహిక లైంగికదాడికి ఆరేండ్ల బాలిక బలైంది. ఊపిరితిత్తులతో పూజలు చేస్తే సంతానం కలుగుతుందన్న పిచ్చి నమ్మకంతో మానవ మృగాలు ఆ చిన్నారిని లైంగికదాడి చేసి కడతేర్చారు. ఈ ఘటన ఉత్తరపద్రేశ్‌లోని ఘటంపూర్‌ ప్రాంతంలో దీపావళి రోజున చోటుచేసుకుంది. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన హత్రాస్‌ ఘటన అనంతరం ఈ దారుణం చోటుచేసుకోవడం గమనార్హం. బాలికపై సామూహిక లైంగికదాడికి పాల్పడటమే కాక, హత్య చేసి.. అనంతరం అత్యంత కిరాతకంగా మృతదేహం నుంచి ఊపిరి తిత్తులను వేరుచేశారు. వీటితో పూజలు నిర్వహిస్తే సంతానం కలుగుతుందన్న నమ్మకంతో తాము ఇలా చేసినట్టు నేరాన్ని అంగీకరించిన నిందితులు పోలీసులకు తెలిపారు. నిందితులు అంకుల్‌ కురిల్‌, బీరన్‌, పరశురామ్‌లను అరెస్ట్‌ చేసినట్టు సీనియర్‌ పోలీస్‌ అధికారి బ్రజేష్‌ శ్రీవాస్తవ తెలిపారు. పరశురామ్‌ ఈ ఘటనకు కీలక సూత్ర ధారి అని, అతని భార్యను కూడా అదుపులోకి తీసుకున్నామని అన్నారు. కాగా, 1999లో తమ వివాహం జరిగిందని, అయితే ఇప్పటివరకు తమకు సంతానం కలగలేదని అన్నారు. బాలికను అపహరించి, ఊపిరితిత్తులతో పూజలు జరిపితే సంతానం కలుగుతుందని తన మేనల్లుడు కురిన్‌, అతని స్నేహితులను ఒప్పించానని విచారణలో అంగీకరించాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘటంపూర్‌ ప్రాంతంలో దీపావళి రోజున టపాసులు కొనుక్కుని ఇంటికి వెళుతున్న బాలికను అపహరించారు. సమీపంలోని అడవికి తీసుకువెళ్లి లైంగికదాడికి ఒడిగట్టారు. అనంతరం హత్యచేసి ఘాతుకానికి పాల్పడ్డారు. బాలిక ఆచూకీ కోసం తల్లిదండ్రులు సమీప ప్రాంతంలో గాలించారు. మరుసటి రోజు సమీప గ్రామానికి దగ్గరలో ఉన్న అటవీ ప్రాంతంలో బాలికకు సంబంధించిన దుస్తులు, చెప్పులు దొరికాయని అన్నారు. నిందితులపై ఫోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్‌ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు తెలిపారు.

Courtesy Nava Telangana

Search

Latest Updates