– సామాన్యుల పొదుపంతా బడాబాబుల చేతుల్లోకే..
– బడాసంస్థలకు మోడీ సర్కార్ నజరానా. ఆర్థికరంగ నిపుణులు
ముంబయి: మునుగుతున్న ప్రయివేటు బ్యాంకులు.. ఆవిరవుతున్న బడుగు జీవుల డిపాజిట్ల గురించి వార్తలు వింటున్నాం. గత కొద్ది మాసాలలోనే ప్రయివేటు ఆర్థిక సంస్థలు ఐ.ఎల్ అండ్ ఎఫ్ ఎస్, పీయంసీ బ్యాంకు, యస్ బ్యాంకు, లక్ష్మీ విలాస్ బ్యాంకులు దివాలా తీశాయి. డబ్బు దాచుకున్న పెన్షనర్లు, సామాన్య ప్రజానీకం రోడ్డున పడ్డారు. ఈ అనుభవాల నుంచి ఏమాత్రం గుణపాఠం నేర్చుకోకుండా కార్పొరేటు కంపెనీలు బ్యాంకులు పెట్టటానికి రంగం సిద్ధమవుతున్నది.
‘ప్రయివేటు బ్యాంకుల యాజమాన్యం – కార్పొరేట్ నిర్మాణం’ అనే అంశాన్ని అధ్యయనం చేసి తగిన సూచన నివ్వటానికి డాక్టర్ ప్రసన్న కుమార్ మహంతి(రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్) నాయకత్వంలో ఒక అంతర్గత కమిటీని రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ)నియమించింది. ఆ కమిటి గత శుక్రవారం తన నివేదికను రిజర్వ్ బ్యాంకుకు సమర్పించింది. ఆ నివేదిక అంబానీ, అదానీ, బిర్లా లాంటి బడా కార్పొరేట్లు స్వంత బ్యాంకులు ప్రారంభించటానికి మార్గ దర్శకాలను రూపొందించింది. ఇది అత్యంత ప్రమాదకరమైన చర్య. ప్రపంచ దేశాల అనుభవాలను పెడచెవిన పెట్టి తీసుకుంటున్న చర్యగా ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
ఈ కమిటీ సిఫారసుల ప్రకారం కార్పొరేట్ కంపెనీలు నేరుగా బ్యాంక్ పెట్టటానికి లైసెన్స్ పొందొచ్చు. అప్పటికే వున్న ఆర్థిక లావాదేవీలు నడుపుతున్న కంపెనీలను బ్యాంకులుగా మార్చవచ్చు. కొత్తగా బ్యాంకు ప్రారంభించడానికి రూ|| 1000 కోట్లు పెట్టుబడి, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రూ|| 50,000 కోట్ల ఆస్తులు కలిగి వుండి పదేండ్లు కనీస అనుభవం వుంటే ఆ సంస్థను బ్యాంకింగ్ సంస్థగా మార్చుకోవచ్చు. పదేండ్లు నిండిన చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులు రూ.
500 కోట్ల పెట్టుబడితో బ్యాంకులు ప్రారంభించవచ్చు. బ్యాంకులను స్థాపిస్తున్న ప్రమోటర్లు 15 ఏండ్లలో మూలధనంలో తమ వాటాను 26 శాతానికి పెంచుకొనే వీలు కల్పించింది. ప్రయివేటు బ్యాంకులతో డైరెక్టర్లు తమ స్వంత వ్యాపారాలకు ఈ బ్యాంకు నిధులను వినియోగించుకోకుండా బ్యాంకింగ్ నియంత్రణ చట్టాన్ని సవరించాలని కమిటీ సూచించింది. బ్యాంకులు పెట్టాలని 2012 నుంచి ఎదురు చూస్తున్న బజాబ్ ఫైనాన్స్, మహేంద్ర అండ్ మహేంద్ర ఫైనాన్స్, టాటా కాపిటల్, ఆదిత్య బిర్లా కాపిటల్, శ్రీరాం ట్రాన్స్పోర్ట్, ఎల్ అండ్ టీ ఫైనాన్షియల్ హౌల్డింగ్ కంపెనీలకు ఇదొక సువర్ణావకాశం.
ఈ కమిటీ సిఫారసులను ప్రభుత్వం అంగీకరించి, బ్యాంకింగ్ నియంత్రణ చట్టానికి అవసరమైన మార్పులు చేస్తే కార్పొరేట్ ప్రయివేటు బ్యాంకులు రంగ ప్రవేశం చేస్తాయి. అన్ని రంగాలనూ, ప్రత్యేకించి బ్యాంకింగ్ రంగాన్ని కార్పొరేట్ల స్వంతం చేయాలని మోడీ సర్కార్ తొందరపడుతున్నది. దీనికోసం బ్యాంకింగ్ సంస్కరణలను వేగవంతం చేసింది. విలీనాల పేరు మీద 27 ప్రభుత్వ రంగ బ్యాంకులను 12 బ్యాంకులుగా కుదించింది.
వాటిలో సగం బ్యాంకులకు ప్రయివేటీకరించాలని ప్రకటించింది. ఈ క్రమంలోనే ప్రయివేటు పరమౌతున్న బ్యాంకులను బడా కార్పొరేట్లకూ, విదేశీ బ్యాంకింగ్ సంస్థలకు అప్పజెప్పడానికి చర్యలను వేగవంతం చేస్తున్నది. దివాలా తీసిన లక్ష్మీవిలాస్ బ్యాంకును సింగపూర్ బ్యాంక్ (డీబీయస్) హస్తగతం చేసింది. ప్రపంచ దేశాలు కడా బ్యాంకింగ్ రంగంలోకి కార్పొరేట్లను అనుమతించటానికి ఆచితూచి అడుగులేస్తున్న సమయంలో మన దేశంలో తలుపులు బార్లా తెరిచి ఆహ్వానించటం ఎటువంటి అనర్థాలకు దారి తీస్తుందో చూడాలి. బ్యాంకులలో వున్న ప్రజల సొమ్మును కాపాడుకోవటం ఇక ప్రజల బాధ్యతే కాబోతుందా?
Courtesy Nava Telangana