– బడా కార్పొరేట్ల బ్యాంక్లతో ప్రమాదకరం
– పారిశ్రామిక వర్గాలకు అవకాశం ఇవ్వొద్దు : ఆర్బీఐ మాజీ గవర్నర్ రాజన్, డిప్యూటి గవర్నర్ విరాల్ ఆచార్య
న్యూఢిల్లీ : బడా కార్పొరేట్ వర్గాలకు బ్యాంకింగ్ లైసెన్స్లు ఇవ్వడం ప్రమాదకరమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురాం రాజన్, డిప్యూటి గవర్నర్ విరాల్ ఆచార్య అన్నారు. ఆ వర్గాలు బ్యాంకింగ్లోకి వస్తే రాజకీయ, ఆర్థిక అంశాల్లో వారి ప్రభావం మరింత పెరుగుతుందనీ.. ఇది దేశానికి మం చిది కాదని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్ వర్గాలను బ్యాంకింగ్లోకి ప్రవే శించకుండా నిషేధించాలన్నారు. బ్యాంకింగ్ రంగంలో ప్రయివేటు, యాజమాన్య మార్గదర్శకాలు, కార్పొరేట్ వ్యవస్థను సమీక్షించేందుకు 2020 జూన్ 12న ఆర్బీఐ అంతర్గతంగా ఓ వర్కింగ్ గ్రూప్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే ఆ కమిటీ ప్రయివేటు బ్యాంక్ల అనుమతికి పలు సిఫారసు లు చేసింది. ఈ నివేదికను ప్రజాభిప్రాయం కోసం జన బాహుళ్యంలో ఉంచింది. ఆర్బీఐ ఇచ్చిన ఈ ముసాయిదా నివేదికపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వీటిని రాజన్, ఆచార్య వ్యతిరేకిస్తూ, విమర్శనాత్మకంగా సామాజిక మాధ్యమం లింక్డిన్లో సంయుక్త ప్రకటన చేశారు. రిజర్వ్ బ్యాంకు చేసిన సూచనను బ్యాడ్ ఐడియా అంటూ వ్యాఖ్యానించారు.
అదే విధంగా ప్రముఖ రేటింగ్ సంస్థ ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ కూడా ఈ సూచనపై ఆం దోళన వ్యక్తం చేసింది. పారిశ్రామిక వర్గాలకు నిధులు అవ సరం అయినప్పుడు అవి నిబంధనలు పాటించకుండా ఆయా తమ సొంత బ్యాంక్ల నుంచి నగదు పొందే ప్రమాదం ఉందని రాజన్, ఆచార్య ఆందోళన వ్యక్తం చేశారు. వీటి ద్వారా తప్పుడు రుణాలు జారీ అయ్యే ప్రమా దం ఉందన్నారు. బ్యాంక్లను పర్యవేక్షించే రెగ్యులేటరీ సంస్థలు కూడా రాజకీయ ఒత్తిళ్లకు గురై 2016లో రుణ జారీ నిబంధనలను సడలించిన విషయాన్ని వారు గుర్తు చేశారు. బ్యాంకింగ్ లైసెన్సింగ్ ప్రతిపాదనలు అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయన్నారు. ఇప్పుడే ఎందుకు ఆ బ్యాంక్లను అనుమతించాలనీ.. అందులోనూ పారిశ్రామిక వర్గాలకే ఎందుకు ప్రాధాన్యతనివ్వాలని విమర్శించారు.
బ్యాంకింగ్లోకి కార్పొరేట్ల ప్రవేశాన్ని కట్టడి చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాల్సింది పోయి ప్రభుత్వం భిన్నంగా వ్యహారిస్తోందన్నారు. రుణ గ్రహీతనే రుణ దాత అయినప్పుడు పారదర్శకత ఎక్కడ ఉంటుందని రాజన్, ఆచార్య ప్రశ్నించారు. రాజకీయ ఒత్తిళ్లు లేదా అత్యవసర పరిస్థితుల సమయంలో రెగ్యూలేటరీ సంస్థలు కూడా కార్పొరేట్లకు లోబడి పోయే అవకాశం ఉందని హెచ్చరించారు. బ్యాంక్ లైసెన్స్ల జారీలో పారదర్శకత పాటించినప్పటికీ.. భవిష్యత్తులో బడా పారిశ్రామిక వర్గాల ప్రాధాన్యతలపైనే దృష్టి సారించే అవకాశం ఉందన్నారు. అదే విధంగా బ్యాంక్లోని నిధులను సొంత అవసరాలకు దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందన్నారు.
మోసగాళ్లుగా మారొచ్చు..
బ్యాంక్ అనుమతులు పొందిన తర్వాత భారత్లో అనేక మంది ప్రమోటర్లు మోసగాళ్లుగా మారిన సందర్బాలను రాజన్, ఆచార్య గుర్తు చేశారు. పారిశ్రామిక వర్గాలకు లైసెన్స్లు ఇవ్వడం ద్వారా బెయిలవుట్ విలువలు కూడా పెరిగిపోవచ్చని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఉన్న పేమెంట్ బ్యాంక్లు రుణాలు జారీ చేయాలనుకుంటే ఇతర బ్యాంక్లతో ఒప్పందాలు కుదుర్చుకోవచ్చని పేర్కొన్నారు. దీని ద్వారా లాభాలను పంచుకోవచ్చన్నారు. ఈ అవకాశం ఉన్నప్పటికీ ప్రత్యేకంగా కార్పొరేట్ హౌస్లకు లైసెన్స్లు ఇవ్వడానికి ఎందుకు చాలా అసక్తి చూపుతున్నారని ప్రశ్నించారు.
ఐఎల్అండ్ఎఫ్ఎస్, యెస్ బ్యాంక్ నుంచి ఎందుకు గుణపాఠాలు తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్బీఐ ప్రతిపాదనలు చాలా రిస్కుతో కూడున్నవని ప్రముఖ రేటింగ్ సంస్థ ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ వ్యాఖ్యానించింది. వర్కింగ్ గ్రూప్ పేర్కొన్న అంశాలతో రిస్క్ ఉందని స్పష్టం చేసింది. కార్పొరేట్ ఇండిస్టీలు నేతత్వంలోని బ్యాంకుల విషయంలో ఈ ప్రమాదం మరింత ఎక్కువని, తద్వారా వచ్చే సమస్య ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని కబళించే అవకాశం ఉందని హెచ్చరించారు.
Courtesy Nava Telangana