– మూడ్ శోభన్
అది కొత్తగా ఎర్పడిన నారాయణపేట జిల్లా. ఆ జిల్లా మరికల్ మండల కేంద్ర గ్రామంలోనే 1970లో ఫైల్ నెం.బి1/5590/70 తేది: 4.12.1970 ప్రకారం దేవరంటి బీమప్ప తండ్రి ఎల్లప్పకు 1.20 ఎకరాలు సేర్వే నెం.449లో లావుని పట్టా ఇచ్చారు. నాటి నుంచి సదరు బీమప్ప మరణించిన తరువాత అతని కుమారుడు, మనువడు 50ఏండ్లుగా సాగు చేసుకుంటున్నారు. బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకున్నారు. అదే సర్వే నెంబర్లో 140ఎకరాలను 72మందికి పట్టాలిచ్చారు. వీరంత దళిత, గిరిజన, వెనకబడిన కూలాలకు చెందిన నిరుపేదలు. 2009లో ఆ భూముల నుంచి 3ఎకరాలలో కోయిల్ సాగర్ కాలువకు భూ సేకరణ జరిగినప్పుడు 30సెంట్లకు రూ.16,320 పరిహారంగా ఇచ్చారు. ప్రస్థుతం ఈ కుటుంబాలకు పోగా మిగిలిన ఆ భూమే ఆధారం. ఆ మండల కేంద్రంలో మరో 400ఎకరాల వరకు చెరువు పడకలతో సహా పేదలకు పట్టాలిచ్చారు. ప్రస్తుతం కొత్తజిల్లా ఎర్పడిన తరువాత ఆ భూములపై ప్రభుత్వం కన్నుపడింది. ఈ పేదలందరిని గత ఆరుమాసాలుగా రెవెన్యూ ఆధికారులు, స్థానిక టీఆర్ఎస్ ఎంఎల్ఏ సహా అందరూ ఆ భూములను ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి ఉచితంగా వదిలిపెట్టమని బెదరిస్తున్నారు. వారు నవంబర్ 9 నుంచి మరికల్ సెంటర్లో నిరాహారదీక్షలు కొనసాగించారు. అయినా ఏ ఆధికారీ వారి ఛాయాలకు వెళ్ళలేదు. ప్రభుత్వ కార్యాలయాల కోసం మండల కేంద్రానికి అనుకొని అనేకమంది భూస్వాములకు భూములున్నాయి. కానీ ప్రభుత్వం, పాలకుల దృష్టి మాత్రం ఈ పేదల భూములపైనే ఉంది.
ఇలాంటి సంఘటనలు ప్రతి జిల్లాలో కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ప్రాజెక్టులు, ప్రయివేట్ కంపెనీల సెజ్లు, రోడ్లు ఇతర ప్రజోపయోగ పనుల పేరుతో ఎక్కడ చూసినా అసైన్డ్ భూములపైనే దృష్టి పెడుతున్నారు. ఒక్క తెలంగాణలోనే ఇంత వరకు సేకరించిన, ఇంకా సేకరించాల్సిన 7లక్షల ఎకరాల భూమిలో 70శాతం భూమి ఇలాంటి పేదలదే. ఏదైనా ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టినప్పడు భూములు సేకరించడానికి అధికారులకు, పాలకులకు భూస్వాముల భూములు కానరావు. ఇప్పటికే అంతంత మాత్రం ఉపాధి ఉన్నవారి ఆధారాలకు నష్టం కలిగించి దిక్కులేని వారిగా చేయడానికి, ఉన్న ఉపాధిని పోగొట్టడానికి ప్రభుత్వాలు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. 1956 అసైన్డ్ చట్టానికి 1977 జనవరి 29న మార్పిడి నిషేదిస్తూ నాటి ప్రభుత్వం 9/77 చట్టం తెచ్చింది. ఈ చట్టానికి 2007 జనవరి 29 వరకు అసైన్డ్ భూములు కోనుగోలు చేసిన పేదలకు పట్టా హక్కు కల్పిస్తామన్నారు. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ఈ సవరణ చట్టానికి మరిన్ని సవరణలు తెస్తూ 2018 మార్చి 20న 1/18 సవరణ చేస్తూ 2018 మార్చి 5 నుంచి అమలులోకి వచ్చే విధంగా రూపొందించింది.
ఈ చట్టం ప్రకారం 2017 డిసెంబర్ 31 వరకు అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన వారికి పట్టా హక్కులు కల్పిస్తామన్నారు. కానీ పై సవరణ చట్టాలు ఏవీ నేటికి అమలు జరగలేదు. ప్రాజెక్టుల నిర్మాణంలో అసైన్డ్ భూములు ముంపునకు గురైతే జీఓఎంఎస్ నెం.1307 తేది.23.12.1993 ప్రకారం ముంపు భూములకు చట్టబద్ద పరిహారం ఇవ్వాలని జీఓ తెచ్చారు. ఇవన్నీ ఆయా కాలల్లో రెవెన్యూ మంత్రుల సంతకాలతోనే ఆమోదం పొందాయి. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అసైన్డ్ భూముల సర్వే ప్రకారం 1956 నుంచి 2014 వరకు అనగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఆధికాంలోకి వచ్చే నాటికి గత ప్రభుత్వాలు 22,55,617 ఎకరాలను 13,88,530 మందికి పట్టాలు ఇచ్చినట్టు సర్వే తెలిపింది. ఇందులో 2,41,749ఎకరాలను 84,706మందికి అమ్ముకునట్టు రికార్డు చేశారు. తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ మంత్రి 31.12.2017కు ముందు కోనుగోలు చేసిన పేదలకు పట్టాలు ఇస్తామని అమలు జరపలేదు. పైగా భూ సేకరణ కింద భూములు వదులుకోవాలని ప్రచారం చేస్తున్నారు.
నేటికి తెలంగాణలో సీలింగ్ భూమి అక్రమంగా భూస్వాముల వద్ద 89,410.48 ఎకరాలు ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వ రికార్డులలో ప్రకటించారు. ఇది కాక భూదాన యజ్ఞ బోర్డు భూములు, దేవాలయ భూములు (63,872ఎకరాలు), అటవీ భూములు, వక్ఫ్ భూములు (77,607ఎకరాలు) అన్నీ పాలకుల అండతో పెట్టుబడిదారులు, భూస్వాములు సంవత్సరాల తరబడి అక్రమించుకొని అనుభవిస్తున్నారు. వీరిని శిక్షించడానికి ఏ చట్టాలూ పని చేయవు. చివరకు పోలీసు యంత్రాంగం సైతం వీరికి రక్షణగా పేదలపై కేసులు పెడుతున్నది. అక్రమంగా 3,4 లింక్ డ్యాక్యుమెంట్లు సృష్టించి పట్టాదారులుగా నమోదు చేసుకున్నారు. అలాంటి వారికి ధరణీ వెబ్సైట్ రక్షణగా ఉంది. ఈ వెబ్సైట్ ఆక్రమణ దారులకు రక్షణ కల్పించడమే తప్ప, రెవెన్యూ రికార్డులలోని లోపాలను సరిదిద్దదు. ఈ వాస్తవం కొద్ది రోజులలోనే ప్రజలు గుర్తిస్తారు. పాలకులు భూస్వాములకు రక్షణ కల్పించడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారు.
రాష్ట్రంలో ‘భూస్వాములు ఎక్కడా?’ అని ప్రశ్నించిన ముఖ్యమంత్రికి తానే స్వయంగా భూస్వామినని తెలియదా? ఇప్పటికి 20వేల మంది దగ్గర 6లక్షల భూమి ఉన్నట్లు రికార్డులు తెలుపుతున్నాయి. ప్రభుత్వ అవసరాలకు, ప్రాజెక్టులకు వీరి భూములు సేకరించవచ్చు కదా? కానీ భూస్వాములపై ప్రేమ కలిగిన పాలకులు వారి అభివృద్దికి నష్టం రాకుండా చూస్తున్నారు. ఎక్కడైనా ప్రాజెక్టు కానీ, కాల్వలు కానీ, రహదారులు కానీ, ప్రభుత్వ కార్యాలయాల కోసం కానీ వారి భూములు అడ్డం వచ్చినప్పుడు ప్రాజెక్టునే మార్చి పేదల భూముల నుంచి సేకరిస్తారు. పైగా ఈ అభివృద్ది వలన పేదలకు లాభం జరుగుతుందని నచ్చజెబుతారు. అప్పటికీ పేదలు వినకపోతే పోలీసుల నిర్భంధం ప్రయోగించి అక్రమ కేసులు బనాయిస్తారు. తమ అస్తులను చట్టవిరుద్ధంగా సేకరించవద్దని కోరుకున్నంతనే వారిపై నిర్భందాలు సాగిస్తున్నారు. రాజ్యంగాన్ని పాలకులే అతిక్రమిస్తున్నారు. అవసరమైతే అప్పటికప్పడు చట్టాలకు సవరణలు తెస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా గట్టు మండలంలో ఆంధ్రప్రదేశ్ మంత్రికి సోలార్ ప్రాజెక్ట్కు తెలంగాణ ప్రభుత్వం 3,000 ఎకరాల అసైన్డ్ భూమిని ధారాదత్తం చేసింది. దీనిపై వారు కోర్డుకు వెళ్ళగా హైకోర్డు పెట్టిన చివాట్లతో తహశీల్దార్ భూసేకరణ ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ఇలాంటి ఘటనలు అనేకం. వీటిని బట్టి పేదల భూములే ప్రభుత్వం సేకరించ దలచుకునట్టు, గత ప్రభుత్వాల దారిలోనే ఈ ప్రభుత్వం సాగుతునట్టు విధితమౌతున్నది.
ఉపాధి కల్పించడంతోపాటు దారిద్య్ర నిర్మూలన చేస్తామంటున్న ప్రభుత్వాలు పేదల స్థిరాస్తుల జోలికి వెళ్ళకుండా భూస్వాముల భూములను సేకరించాలి. కావాల్సిన భూమికి 10-15 రెట్లు అదనంగా సేకరించి రియల్ఎస్టేట్ వ్యాపారులకు లాభం కలిగి స్తున్నారు. ఎక్కడైనా ప్రాజెక్టు వస్తుందని ప్రభుత్వం ప్రకటించగానే పాలకులు అక్కడ తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసి తిరిగి ప్రభుత్వ ప్రాజెక్టుకు 4,5 రెట్లు ఎక్కువ ధరకు అమ్ముకుని వందల కోట్లు గడిస్తున్నారు. ఇలాంటి పాలకులకు పేదల ఆస్థులను కాజేయడంపై కనికరం ఉంటుందా? ప్రభుత్వ కార్యాలయాలకు ఎన్ని ఎకరాలు కావాలి కానీ నేటి పాలకులు రియలెస్టేట్ వ్యామోహంలో పడి పేదల జీవితాలతో అటలాడుతున్నారు.
ప్రభుత్వాలు చట్టాలను చేయడంకాదు. వాటిని గౌరవించి అమలు చేయాలి. అక్రమార్కులపై చర్యలు తీసుకోగలిగిన దైర్యం కలిగి ఉండాలి. ప్రస్తుతం భూముల ధరలు పెరిగిన నేపథ్యంలో పేదల భూములను ప్రాజెక్టుల కోసం, భవనాల కోసం తీసుకోవడాన్ని మినహాయించాలి. ప్రభుత్వం చట్టాలను కచ్చితంగా అమలు చేయాలి.
Courtesy Nava Telangana