నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లి అఘాయిత్యం

Published on

  • కాకినాడలో దారుణం
  • సకాలంలో వైద్యం అందించలేదని బంధువుల ఆరోపణ

కాకినాడ (మసీదు సెంటర్‌) : ఇంట్లో నిద్రిస్తున్న ఐదేళ్ల చిన్నారిని గుర్తుతెలియని వ్యక్తి అపహరించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో బుధవారం ఈ దారుణ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నగరానికి చెందిన బాలిక తల్లి ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌ వెళ్లగా అమ్మమ్మ, తాతయ్య, తండ్రితో కలిసి ఉంటోంది. చిన్నారి తన అమ్మమ్మ వద్ద నిద్రిస్తుండగా కామాంధుడు అర్ధరాత్రి సమయంలో ఎత్తుకెళ్లాడు. అరవకుండా ఉండేందుకు దారి పొడవునా కొడుతూ సమీపంలోని శ్మశానవాటిక వద్దకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. దుస్తుల్లేకుండా శరీరమంతా తీవ్రగాయాలతో ఉన్న బాలికను సమీపంలో పడేయగా.. వేకువజామున 4.30 గంటల సమయంలో అటుగా వెళ్తున్న వ్యక్తి గుర్తించాడు.

అప్పటికే బాలిక కనిపించడం లేదని వెతుకుతున్న ఆమె అమ్మమ్మకు చిన్నారిని అప్పగించాడు. కుటుంబసభ్యులు చిన్నారిని వెంటనే కాకినాడ జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. కాకినాడ ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి బాలికను పరామర్శించారు. నిందితుడిని వీలైనంత త్వరగా అరెస్టు చేస్తామని, అందుకు మూడు బృందాలు ఏర్పాటుచేశామని తెలిపారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకొస్తే మెడికో లీగల్‌ కేసు (ఎంఎల్‌సీ) తీసుకురావాలని వైద్యం ఆలస్యం చేశారని..ఉదయం 10 గంటలకు సీఐ రామ్మోహన్‌ చొరవతో చికిత్స ప్రారంభించారని బాలిక తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ రాఘవేంద్రరావును వివరణ కోరగా..ఆ సమయంలో పిల్లల వైద్యుడు, మత్తు డాక్టర్‌ వేరే శస్త్రచికిత్సలో ఉండటంతో కొంత జాప్యం జరిగిందనీ.. వెంటనే వైద్యసేవలు అందించామని తెలిపారు.

Courtesy Eenadu

Search

Latest Updates