– రాజ్కోట్ ఆస్పత్రిలో చెలరేగిన మంటలు
– ఐదుగురు కరోనా రోగులు మృతి
అహ్మదాబాద్ : గుజరాత్లో దారుణం చోటుచేసుకున్నది. కోవిడ్-19 కోసం కేటాయించిన రాజ్కోట్లోని ఆస్పత్రిలో మంటలు చెలరేగి ఐదుగురు కరోనా రోగులు మరణించారు. శుక్రవారం ఉదయం ఆస్పత్రిలోని ఐసీయూలో మంటలు ఎగిసి ఈ దారుణం చోటు చేసుకున్నది గుజరాత్ ఉపముఖ్యమంత్రి నితిన్ పటేల్ తెలిపారు. అలాగే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో 26 మంది రోగులను రక్షించి మరొక చోటుకు తరలించినట్టు వివరించారు. ” ఆనంద్ బంగ్లా చౌక్ ప్రాంతంలోని ఓ నాలుగు అంతస్థుల ఆస్పత్రి భవనంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. మొదటి అంతస్థులో ఉన్న ఐసీయూలో శుక్రవారం ఉదయం 12.30 గంటలకు మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఆస్పత్రిలో 31 మంది రోగులున్నారు” అని నితిన్ పటేల్ చెప్పారు. అయితే వెంటిలేటర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు ప్రాథమిక విచారణలో బయటపడిందని తెలిపారు. కాగా, ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన గుజరాత్ సీఎం విజరు రూపానీ సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. దర్యాప్తు అధికారిగా ఐఏఎస్ ఏకే రాకేశ్ను నియమిస్తున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ఈ ఏడాది ఆగష్టులో కూడా అహ్మదాబాద్లోని ఓ కోవిడ్-19 ఆస్పత్రిలో మంటలు చెలరేగి ఎనిమిది మంది కరోనా రోగులు చనిపోయిన విషయం విదితమే.
Courtesy Nava Telangana