– తల్లిదండ్రుల ఉద్యమానికి బాసటగా పిల్లలు
– రైతుల ఆందోళనలో మేము సైతమంటూ…
– తమ చదువులేమీ పోవని స్పష్టం
– జీవనోపాధిని కోల్పోతే మార్క్షీట్తో ఉపయోగమేమీ లేదు
న్యూఢిల్లీ : గత తొమ్మిది రోజులుగా దేశ సరిహద్దుల్లో అన్నదాతల ఉద్యమం కొనసాగుతున్నది. కాగా, రైతుల ఉద్యమానికి వారి పిల్లలు బాసటగా నిలిచారు. తల్లిదండ్రులతో కలిసి ఉద్యమంలో భాగస్వాములవుతున్నారు. ఉదయం ఆందోళనలో పాల్గొంటూ.. రాత్రిపూట అక్కడే చదువుకుంటూ దేశంలోని విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వారికి యావత్ దేశం జేజేలు పలుకుతున్నది. తల్లిదండ్రులతో కలిసి పంజాబ్లోని వివిధ ప్రాంతాల నుంచి ఢిల్లీ సరిహద్దులకు చాలా మంది పిల్లలు వచ్చారు. వారు తమ రాత్రులను హైవేల్లో, గుడారాల్లో, ట్రాకర్ ట్రాలీల్లో గడుపుతున్నారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగే ఆందోళనలో భాగస్వాములవుతున్నారు. పాఠాలను చదవటానికీ, సిలబస్ను తెలుసుకోవడానికి ఉపాధ్యాయులతో సమన్వయం చేసుకోవడానికి వాట్సాప్ల్లో కొంత సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇలా తల్లిదండ్రులతో కలిసి ఢిల్లీ సరిహద్దుల్లోకి వచ్చి ఆందోళనలో పాల్గొన్న పిల్లల్లో 11 ఏండ్ల గుర్సిమ్రాత్ కౌర్ ఒకరు.
పంజాబ్ లోని హౌషియార్పూర్ జిల్లా మంగట్ గ్రామానికి చెందిన ఆరో తరగతి విద్యార్థి గుర్సిమ్రాత్ కౌర్ (11)కు ఈ నెల చివరిలో పరీక్షలున్నాయి. కాగా, నవంబరు 26 చలో ఢిల్లీ ఆందోళనలో పాల్గొనేందుకు రైతులు నిత్యావసరాలు సర్దుకుంటున్నప్పుడు.. ఆమె కూడా తన పుస్తకాలనూ సర్దుకున్నది. ”నాకు సమయం దొరికినప్పుడల్లా నేను చదువుతాను” అని ఆమె చెప్పింది. ప్రస్తుతం ఆమె తన తల్లిదండ్రులతో కలిసి ఢిల్లీ-హర్యానా సరిహద్దు ప్రాంతం సింఘూ వద్ద రైతుల ఆందోళనలో భాగస్వామ్యం అయింది. ‘వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్లో జరిగిన నిరసనల్లో మేం పాల్గొన్నాం. దీనర్థం మేం మా చదువును వదిలేయలేదు. రాత్రి చదువుకుంటున్నాం.. పగలు ఉద్యమంలో పాల్గొంటున్నాం. గతంలోలాగే నేను ఈసారి కూడా ఎ+ స్కోర్ సాధిస్తాను’ అని తెలిపింది.
తన తల్లి సుఖ్బీర్తో కలిసి పొలాల్లో పనిచేస్తూ తనను తాను రైతుగా గుర్తించుకున్న కౌర్, నిరసనకు రాకముందు పంజాబీలో మూడు వ్యవసాయ చట్టాలను అనువాదం వెర్షన్ను చదివింది. ప్రభుత్వ నియంత్రణలో ఉన్న వ్యవసాయ మార్కెట్ల నెట్వర్క్కు దూరంగా ఉన్న కొత్త సంస్కరణలు రైతులు అవకాశాలను దెబ్బతీస్తాయని పేర్కొంది. ‘మేమందరం రైతులం, మా జీవనోపాధిని కాపాడుకోవాలనుకుంటున్నాం. అందుకే మేం ఇక్కడ ఆందోళన చేస్తున్నాం” అని కౌర్ అన్నారు. ఆమెకు వాట్సాప్లో తరగతులకు సంబంధించిన పాఠాలు వస్తాయి. పరీక్షలు ఎక్కువగా ఆన్లైన్లోనే జరుగుతాయి.
తల్లిదండ్రులు పిల్లలను నిరసనల్లో పాల్గొనాలని బలవంతం చేయలేదు. అయితే యువతకు నిరసనలు, సోషల్ మీడియా నుండి ప్రణాళికలు వచ్చాయని సుఖ్బీర్ కౌర్ చెప్పింది. ‘ఏం జరుగుతుందో వారికి తెలుసు. వారూ నిరసనల్లో పాల్గొనాలని నిశ్చయించుకున్నారు. చట్టాలు ఆమోదించినప్పటి నుంచీ మేం మా గ్రామంలో నిరసన వ్యక్తం చేస్తున్నాం. మా కుమార్తె ఎల్లప్పుడూ మాతోనే ఉంది’ అన్నారు.
కౌర్ మాదిరిగా హర్మాన్ సింగ్ సింఘూలో ఉన్నారు. ఉదయం 7 గంటలకు రైతులతో కలిసి నినాదాలు చేస్తూ తన రోజును ప్రారంభిస్తాడు. స్కూలు నుంచి వచ్చిన తన స్మార్ట్ఫోన్లో వచ్చిన అసైన్మెంట్లను రాత్రి పూట పూర్తి చేసుకోవటం, చదువుకోవటంతో రోజు ముగుస్తున్నది. ‘మేం మా చదువును కొనసాగిస్తూ… మా హక్కుల కోసం పోరాడుతున్నాం. దీనికి ప్రత్యామ్నాయం మరొకటి లేదు. నేను ఉదయాన్నే లేస్తాను. పగలు నిరసనల్లో పాల్గొంటాను. రాత్రి రెండు గంటలు చదువుతాను’ అని పంజాబ్లోని మాన్సా జిల్లాలోని సంఘ గ్రామానికి చెందిన 14 ఏండ్ల యువకుడు చెప్పాడు.
‘ఇది మా పెద్దల పోరాటం మాత్రమే కాదు. ఆ చట్టాలవల్ల మా కుటుంబాలు దెబ్బతింటాయి. అందువల్ల విద్యను మా ప్రాధాన్యతగా కొనసాగిస్తూ మేమందరం ఆందోళనలో భాగస్వాములం కావాల్సిన అవసరం ఉన్నది’ అని సింగ్ అన్నారు. తన తొమ్మిదో తరగతి పాఠ్య పుస్తకంలోని రెండు అధ్యాయాలను పూర్తి చేశాడు. గత ఐదు రోజుల్లో అతని సైన్స్ పాఠ్య పుస్తకం నుంచి ఒక అధ్యాయనాన్ని పూర్తి చేశాడు. తల్లిదండ్రులు హిసార్లో ఉన్నప్పటికీ సింగ్ తన బంధువులతో కలిసి సింఘూ వద్ద ఆందోళనలో ఉన్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో కోవిడ్-19 మహమ్మారితో పాఠశాలలను మూసివేశారనీ, ఇప్పుడు ఆన్లైన్లో క్లాసులు జరుగుతున్నాయని చెప్పాడు. ‘మా చదువు ఎక్కువగా ఆన్లైన్లోనే జరుగుతోంది కాబట్టి, మేము ఎక్కడైనా ఉండవచ్చు. మా చదువును కొనసాగించవచ్చు. మా ఉపాధ్యాయులు వాట్సాప్లో స్టడీ మెటీరియల్ను పంపుతున్నారు. మేము ఎప్పుడైనా చదువుకోగలం’అని అన్నారు.
‘కోవిడ్-19 సంక్షోభం సంభవించినప్పటి నుంచి ఆన్లైన్ ద్వారా క్లాసులు జరుగుతున్నాయి. కాబట్టి, నిరసన తెలపడానికి మేం ఇక్కడ ఉంటే చదువులు కోల్పోం. కానీ మా జీవనోపాధిని కోల్పోతే… మా మార్క్షీట్ వల్ల ఏం ఉపయోగం ఉంటుంది?’ అని పంజాబ్లోని ఎస్బీఎస్ నగర్ జిల్లాలోని మాంగోవాల్ గ్రామానికి చెందిన ఏడో తరగతి విద్యార్థి మెహేక్ ప్రీత్ ఖాట్కర్ ప్రశ్నించారు.
భారతీయ కిసాన్ యూనియన్ సభ్యుడు సుచా సింగ్ మాట్లాడుతూ నిరస నలో ఉన్న పిల్లలు తమ పరిసరాల గురించి తెలుసుకున్నారన్నారు. ‘వారి కుటు ంబాలు ఎదుర్కొంటున్న కష్టాలను వారు చూశారు. ఈ వ్యవసాయ చట్టాలు ఏమి టో? అవి ఎవరి కోసంతెచ్చారో.. అర్థం చేసుకున్నారు. పిల్లలు తమ భూ ములను రక్షించుకోవడానికి ఇక్కడ లేకపోతే.. వారి భవిష్యత్తు సంక్షోభంలో పడు తుందని వారికి తెలుసు. కాబట్టి పిల్లలు నిరసనకు రావాలని కోరుకున్నారు’ అన్నారు.
మేము సైతం….
దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా పంజాబ్లో జరుగుతున్న రైతాంగ పోరును మహిళలు వెనకుండి నడిపిస్తున్నారు. పురుషులు 24 గంటలూ జరుగుతున్న ధర్నాల్లో నిమగమై ఉంటే.. మహిళలు వారికి కావాల్సిన భోజన ఏర్పాట్లను సమకూరుస్తున్నారు. గ్రామాలలో మహిళా కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ కమిటీలోని సభ్యులు ప్రతిరోజూ సాయంత్రం గ్రామంలో వాడవాడకు తిరుగుతూ ఆహారధాన్యాలు, కూరగాయలు ఇంకా కావాల్సిన ఇతర వస్తువులను సేకరిస్తున్నారు. ధర్నా వద్ద ఉన్న వారికి ఆహారాన్ని వండి పంపిస్తున్నారు. పనంతా ముగించుకుని మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల వరకూ ధర్నాలో పాల్గొంటునానరు. సాయంత్రం ఊరుకు చేరుకొని వంటసామ్రాగి సేకరణలో నిమగమవుతున్నారు. దేశ రాజధాని నుంచి ఎప్పుడు పిలుపువస్తే అప్పుడు అక్కడకు వెళ్ళటానికి సర్వసన్నద్ధంగా ఉన్నారు. 70 ఏండ్ల అవ్వల నుంచి 20 ఏండ్ల యువతులు, బడి పిల్లలు కూడా ఈ మహత్తర కార్యక్రమంలో మమేకమవుతున్నారు. ఈ పోరాటంలో మేం పాల్గొనకపోతే ద్రోహులుగా మిగిలినపోయినవారమవుతాని వారు చెపుతుండటం గమనార్హం.
Courtesy Nava Telangana