బీజాపూర్‌లో 14 మంది నక్సల్స్ అరెస్ట్

Published on

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో ఆదివారం 14 మంది మావోయిస్టులను అరెస్టు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ జితేంద్ర యాదవ్ తెలిపారు. వీరిలో ఆరుగురు మహిళలు, ఎనిమిది మంది పురుషులు ఉన్నారని తెలిపారు. గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధి లోని ముట్వెండి అటవీ ప్రాంతం, పిడియా గ్రామాల్లో ఆదివారం డిఆర్‌జి, జిల్లా పోలీస్‌ల సంయుక్త బృందం వీరిని పట్టుకున్నారని చెప్పారు.

14 మంది నక్సల్స్‌లో రేణు కొసవి , మంగ్లీ అవ్లంలకు ఒక్కొక్కరికి రూ. 8 లక్షల రివార్డు ఉంది. వీరిద్దరూ మిలిటరీ కంపెనీ నెంబరు 2 కు చెందిన వారు. గంగలూరు ఏరియా కమిటీ సభ్యులు బిచ్చెం యుయికా, షర్మిలా కుర్సం, లక్ష్మీతాటి ఒక్కొక్కరిపై రూ. 5 లక్షల రివార్డు ఉందన్నారు. మరో నలుగురు క్యాడర్లకు రూ. 2లక్షల వంతున, మిగతా ఇద్దరికి లక్ష వంతున రివార్డులు ఉన్నాయని పోలీస్‌లు ప్రకటనలో వివరించారు.

వారి దాచి ఉంచిన నాలుగు టిఫిన్ బాంబులు, రెండు కుకర్ బాంబులు, డిటొనేటర్లు, కార్డెక్సు వైర్, జిలటిన్ స్టిక్స్, ఫైర్‌క్రాకర్లు, మావోయిస్టుల సంబంధిత మెటీరియల్ వారి నుంచి స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. పోలీసు పార్టీకి భారీ నష్టం చేకూర్చేందుకు పిడియ-ముటవెండి రహదారిపై ఐఈడీని అమర్చేందుకు పథకం వేశారని పోలీసులు తెలిపారు.

రెండు రోజుల క్రితం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 12 మంది నక్సల్స్‌ను హతమార్చడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారి వివరాలు పోలీస్‌లు ఇంకా తెలియజేయలేదు. అయితే ఈ ఎన్‌కౌంటర్ బూటకమని గ్రామస్థులు, ఉద్యమకారులు విమర్శిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను పోలీస్‌లు కొట్టి పారేశారు. వీరందరి తలపై నగదు బహుమతులున్నాయని వివరించారు.

Search

Latest Updates