వైరస్‌లను పసిగట్టేలా… వ్యాధుల పనిపట్టేలా!

Published on

దుస్తుల తయారీలో దీప్తి

వాతావరణ కాలుష్యం, బ్యాక్టీరియా, వైరస్‌లను మనం ధరించే దుస్తులే ముందుగా పసిగడితే… వాటిని నిరోధిస్తే..! ఇప్పుడు అలాంటి వస్త్రానికి రూపకల్పన చేసింది హైదరాబాద్‌కు చెందిన దీప్తి నత్తల.  వ్యాధి నిరోధకశక్తి ఉండే వస్త్రాన్ని రూపొందించి శభాష్‌ అనిపించుకుంది.

హైదరాబాద్‌లో ఇంటర్‌ వరకు చదువుకున్న దీప్తి ఐఐటీ-మద్రాస్‌లో ఇంజినీరింగ్‌ పూర్తి చేసింది. ఆ తరువాత దుబాయి, కాలిఫోర్నియాల్లో ఉద్యోగం చేసి, ఎనిమిదేళ్ల తరువాత ఇండియాకు తిరిగొచ్చింది. ఇక్కడి వాతావరణంలో పెరిగిన వేడి, గాలిలో కాలుష్యం వల్ల కలిగే అనారోగ్యాలను గుర్తించింది. పగటిపూట హైదరాబాద్‌లో బయటికెళ్లి, తిరిగి వచ్చేసరికి చర్మంపై యూవీ కిరణాల ప్రభావం ఎంతగా పడుతోందో ఈమెకు అనుభవమైంది. మహిళలెక్కువగా వాహనాల్లో ప్రయాణించేటప్పుడు ముఖానికి స్కార్ఫ్‌ లేదా దుపట్టాను వినియోగించడంలో ఎంతవరకూ కాలుష్యాన్ని నిరోధించగలుగుతున్నారో తేల్చుకోవడానికి తాను వాడిన స్కార్ఫ్‌ను పరిశోధనాశాలకు పంపింది. ఆ నివేదికను చూసి దీప్తి ఆశ్చర్యపోయింది. గాలిలో కాలుష్యం, యూవీ కిరణాల ప్రభావాన్ని ఈ వస్త్రాలు కేవలం 10 శాతం మాత్రమే అడ్డుకోగలుగుతున్నట్లు ఆ నివేదిక తేల్చింది. దీంతో ఈ దిశగా తానేదైనా చేయాలనుకుందీమె.

తమిళనాడులోని సేలం, కోయంబత్తూరు నుంచి కాటన్‌ దారపు కండెలను తెప్పించి ముందుగా వాటిని డై పిగ్మంటేషన్‌ పద్ధతిలో ప్రత్యేక మాలిక్యూల్స్‌ను కలిపి, ఆరనిచ్చి ఆ తరువాత ఆ దారాలతో వస్త్రాన్ని తయారుచేయించడం దీప్తి పరిశోధనలో తొలి ప్రయత్నం. ఇందుకోసం ప్రయోగాలెన్నో చేసింది. అలా తయారైన వస్త్రాన్ని ఇంటర్నేషనల్‌ ల్యాబొరెటరీకి పంపేది.  ‘ఎన్నోసార్లు నేను చేసిన ప్రయోగం విఫలమయ్యేది. తిరిగి నా ప్రయత్నం కొనసాగించేదాన్ని. ఆ సమయంలో నా స్నేహితులు ఈ పరిశోధనపై సంశయాన్ని వ్యక్తం చేసేవారు. నేను మాత్రం సాధించగలనని అనుకునేదాన్ని. అలా ఎనిమిది నెలల తరువాత  99 శాతం ఫలితాన్ని సాధించగలిగా’ అని వివరిస్తారు దీప్తి. వ్యాధికారకాలు, యూవీ కిరణాలను నిరోధించగలిగే పూర్తి సామర్థ్యం మేం తయారుచేసిన వస్త్రంలో వ్యాధి నిరోధక శక్తి  ఉందని నివేదిక వచ్చిన తరువాత నాలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. ఇలా తయారుచేసిన వస్త్రంతో మా మొదటి ఉత్పత్తి ‘హెడ్‌గేర్‌’ను ప్రారంభించా. మహిళలు ధరించే దుపట్టాలకు అడ్వాన్స్డ్డ్‌గా, ద్విచక్రవాహనాలపై ప్రయాణించేటప్పుడు ధరించడానికి సౌకర్యవంతంగా, పర్యావరణ హితంగా ఉండేలా రూపొందించాం. ఇందులో మహిళలకు మాత్రమే ఉపాధి కల్పించా. మొదట 150 మందిని తీసుకున్నా. హైదరాబాద్‌, రాజమండ్రి, ముంబయి నగరశివారుల్లో వీటి తయారీ మొదలైంది. రెండేళ్లక్రితం ‘దిబ్బూ సొల్యూషన్స్‌’ సంస్థనూ స్థాపించా. అలా తయారైన ఉత్పత్తులను ముందుగా ఆన్‌లైన్‌లో విక్రయానికి ఉంచా.  దుప్పట్లు, వైద్యులు చికిత్స సమయంలో ధరించే కోట్లును ‘హికాల్‌’ వస్త్ర ఉత్పత్తుల పేరుతో రూపొందించడం మొదలుపెట్టాం’ అని చెబుతుంది దీప్తి.

కరోనావైరస్‌ వ్యాప్తి చెందుతున్న సమయంలో ఈ తరహా వస్త్రంతో ప్రత్యేక మాస్క్‌లను కూడా తయారు చేసిందీమె. భారతరైల్వేశాఖ, కేంద్ర మంత్రిత్వశాఖల కార్యాలయ సిబ్బందికి,  ఆసుపత్రుల సిబ్బంది దీప్తి  సంస్థ భారీ ఎత్తున మాస్క్‌లను పంపిణీ చేసింది. ఇందుకోసం వేలాది మాస్క్‌ల తయారీకి అహోరాత్రులు మహిళాసిబ్బంది శ్రమించారని చెబుతారీమె.

స్విట్జర్లాండ్‌, ఆస్ట్రేలియాలకు చెందిన హెల్త్‌గార్డ్‌, లివింగ్‌ గార్డ్‌, వైరోబ్లాక్‌ సంస్థలు రూపొందించిన కరోనా వైరస్‌ను నిరోధించగలిగే వస్త్రాన్ని పోలి ఉన్నదాన్ని దీప్తి తయారుచేయగలిగింది. పలు పరిశోధనల అనంతరం యాంటీవైరల్‌ కాంపోజిషన్‌సాంకేతికతను ఈమె  సాధించింది. నేషనల్‌ ల్యాబొరెటరీ పరిశీలనలో కూడా ఇది రుజువైంది. ఫలితమే హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన టీఐఈ ఉమెన్‌ రీజనల్‌ఫైనల్స్‌లో దీప్తి రెండో స్థానంలో నిలిచింది.

Courtesy Eenadu

Search

Latest Updates