– విమర్శలు వెల్లువెత్తటంతో సందేశాలు తొలగింపు
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకుడు నాగోతు రమేశ్నాయుడు ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సేను ఒక పోరాట యోధుడిగా కీర్తిస్తూ ఆయన ట్విట్టర్లో సందేశాలు పోస్ట్ చేశారు. ‘నిజమైన పోరాటయోధుడికి సెల్యూట్ చేస్తున్నా’నంటూ గాడ్సేను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఈ సందేశాలపై ట్విట్టర్లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో ఆ సందేశాల్ని రమేశ్నాయుడు తొలగించారు. తన ట్విట్టర్ ఖాతా నిర్వహిస్తున్నవారు చేసిన పొరపాటు ఇది, అభ్యంతరకరమైన పోస్టులు పెట్టినవారిని, వారి సేవల్ని తొలగిస్తున్నానని…తెలియజేస్తూ రమేశ్నాయుడు మరో సందేశాన్ని ట్విట్టర్లో పెట్టారు. రమేశ్నాయుడు ఆంధ్రప్రదేశ్ భారతీయ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. 2019 సాధారణ ఎన్నికలకు ముందు భోపాల్ బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ కూడా ‘గాడ్సేను కీర్తిస్తూ, పోరాటయోధుడిగా పేర్కొంటూ’ ప్రసంగాలుచేసింది. దేశవ్యాప్తంగా రాజకీయంగా ఇది తీవ్ర దుమారం రేపింది.
Courtesy Nava Telangana