- ఏకే-47సహా.. పెద్ద మొత్తంలో తుపాకులు
- ఉగ్రవాదులతోనూ సంబంధాలు ఉండొచ్చు!
- అంటకాగిన అందరిపై విచారణ జరపాలి
- గ్యాంగ్స్టర్ కేసుపై గవర్నర్కు ఎఫ్జీజీ లేఖ
హైదరాబాద్ : గ్యాంగ్స్టర్ నయీం కేసులో సమగ్ర, సత్వర విచారణకు ఆదేశించాలని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్(ఎ్ఫజీజీ) లేఖ రాసింది. నయీం ఎన్కౌంటర్ తర్వాత అతడి నివాసాల్లో జరిపిన తనిఖీల్లో పదుల సంఖ్యలో ఆయుధాలు, పెద్దమొత్తంలో మందుగుండు, పేలుడు పదార్థాలు లభించాయని.. వాటిని సమకూర్చుకోవడంలో పోలీసు అధికారులు అతడికి సహకరించి ఉంటారని ఎఫ్జీజీ కార్యదర్శి పద్మనాభరెడ్డి గవర్నర్కు రాసిన లేఖలో కోరారు. ఏకే-47 వంటి ఆయుధాలను సమకూర్చుకున్న నయీంకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉండే అవకాశాలు ఉండి ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశారు.
నయీంతో అంటకాగిన పోలీసు, రాజకీయ నాయకులు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులపై సమగ్ర విచారణ జరిపి, వారందరిపైనా చర్యలు తీసుకునేలా ఆదేశించాలని గవర్నర్ను కోరారు. నయీం ఎన్కౌంటర్ తర్వాత లభించిన ఆయుధాలు, డబ్బు, పత్రాలకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారిగా ఉన్న ఐజీ నుంచి సేకరించిన వివరాల్ని లేఖలో గవర్నర్కు వివరించారు. ఐజీ సమర్పించిన సిట్ నివేదికను లేఖకు జతచేశారు.
ఏకే 47.. గ్రనేడ్లు..
నయీం నివాసాల్లో పోలీసులు జరిపిన తనిఖీల్లో మూడు ఏకే-47లు, 9 పిస్టళ్లు, 3 రివాల్వార్లు, 7 తపంచాలు, ఒక ఎస్బీబీఎల్ 12 బోర్ గన్, ఒక స్టెన్గన్, రెండు హ్యాండ్ గ్రనేడ్లు, 10 జెలిటెన్ స్టిక్స్, 5 కేజీల అమోనియం నైట్రేట్, 10 మీటర్ల ఫ్యూజ్ వైరు, ఆరు మేగజీన్లు, 616 తూటాలు, 30 డిటోనేటర్లు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, రూ. 2.16 కోట్ల నగదు, 1.944 కిలోల బంగారం, 2,482 కిలోల వెండి, 21 కార్లు, 26 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని.. వీటన్నింటిపైనా విచారణ జరపాలని పద్మనాభరెడ్డి అభిప్రాయపడ్డారు.
కొన్ని వేల ఎకరాలకు సంబంధించి 752 భూమి రిజిస్ట్రేషన్ పత్రాలు లభించాయని.. ఇన్ని రిజిస్ట్రేషన్లు నయీం ఎలా చేయగలిగాడనే విషయంపై విచారణ జరపాల్సి ఉందని గవర్నర్కు రాసిన లేఖలో పద్మనాభరెడ్డి కోరారు. రాజకీయ నాయకులు, పోలీస్, రెవెన్యూ అధికారుల సహకారం లేనిదే ఇదంతా సాధ్యం కాదన్నారు.
కాల్డేటా పరిశీలించని సిట్..
నయీం నివాసాల్లో 602 సెల్ఫోన్లు దొరికాయని, వాటి కాల్డేటాను పరిశీలిస్తే నయీంతో టచ్లో ఉన్నవారి వివరాలు తెలుస్తాయని పద్మనాభరెడ్డి అభిప్రాయపడ్డారు. కాల్ డేటా తీస్తే.. రాజకీయ నాయకులు, పోలీసు ఉన్నతాధికారుల పేర్లు బయటకు వస్తాయనే ఉద్దేశంతోనే సిట్ అలా చేయడం లేదన్నారు. నయీం ఇంట్లో లభించిన 130 డైరీల్లో చాలా మంది ఆఫీసర్లు, రాజకీయ నాయకుల పేర్లు ఉండి ఉంటాయని, అలాంటి డైరీల్ని సరిగా పరిశీలించకుండా న్యాయస్థానాల్లో డిపాజిట్ చేశారన్నారు.
Courtesy Andhrajyothi