- 1994లో సాదాబైనామాతో భూమి కొనుగోలు
- విక్రేత మృతితో భూమిని మరొకరికి విక్రయించిన కుమారులు
- సాగు చేస్తున్న రైతు బలవన్మరణం
తుర్కపల్లి(బొమ్మలరామారం) : రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన డబ్బుతో ఆ భూమిని కొనుక్కున్నాడా రైతు. అయితే.. రిజిస్ట్రేషన్ చేయించుకోక, కేవలం సాదాబైనామా రాయించుకోవడం అతనికి శాపమైంది. ఆ భూమి దక్కకపోవ డంతో మనోవేదనతో ఆత్మహత్య చేసుకున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది. బొమ్మలరామారం మండలంలోని తూముకుంట గ్రామానికి చెందిన నెల్లుట్ల లింగాలు(55) మేడ్చల్ జిల్లా శివారు తూముకుంట గ్రామ రెవెన్యూ సర్వే నెంబరు 239లో 18గుంటల భూమిని అదే గ్రా మానికి చెందిన గుండ్లపల్లి మల్లాగౌడ్ వద్ద 1994లో కొనుగోలు చేశాడు. రూ.16,500కు కొని, సాదాబైనామా రాయించుకున్నాడు.
ఆ భూమి తన పేరిట పట్టా లేకపోవడంతో మార్పిడి జరిగిన తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తానని పెద్దమనుషుల ఎదుట మల్లాగౌడ్ అంగీకరించాడు. అప్పటినుంచి లింగాలు ఆ భూమిని కాస్తు చేస్తున్నాడు. ఇదిలా ఉండగా.. మల్లాగౌడ్ పదేళ్ల క్రితం మృతిచెండంతో అతడి కుమారుల పేరిట 2010లో భూమి పట్టా అయింది. ఆ భూమిని తాను కొనుగోలు చేశానని, తన పేరిట రిజిస్ట్రేషన్ చేయాలంటూ గ్రామపెద్దల సమక్షంలో లింగాలు పంచాయితీ పెట్టాడు. మరికొన్ని డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని వారు తీర్పు చెప్పారు. తూముకుంటలో భూముల ధరలు పెరగడంతో.. మల్లాగౌడ్ కుమారులు, 20రోజుల క్రితం వేరేవారికి ఆ భూమిని విక్రయించారు. తీవ్ర మనోవేదనకు గురైన లింగాలు, శనివారం రాత్రి ఇంట్లో పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బొమ్మలరా మారం పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
Courtesy Andhrajyothi