మార్క్సు, ఎంగెల్సులు ఏరకపు శ్రామికులవుతారు?

Published on

– రంగనాయకమ్మ

మార్క్సూ, ఎంగెల్సులు, కార్మికులా, లేక స్వతంత్ర శ్రామికులా? వీరిద్దరూ శ్రమలు చేశారా, లేదా? చేసివుంటే, వీరు శ్రామికులుగా ఏ కోవకు చెందుతారు?

యజమాని పెత్తనం కింద, ‘సరుకు’తయారీ కోసం, భూమి కౌళ్ళ-వడ్డీల- లాభాల విధానాల ద్వారా ‘శ్రమ దోపిడీ’ జరిగే సమజంలో, రోజుకి కొన్ని గంటల లెక్కన, ‘జీతాల్ని’ డబ్బు ద్వారా తీసుకునే పద్ధతిలో, శ్రమలు చేసే వారుగా ఆ శ్రమలు, శారీరక శ్రమలైనా, మేధా శ్రమలైనా, ఉత్పాదక శ్రమలైనా, అనుత్పాదక శ్రమలైనా ఏదో ఒక రకం శ్రమ చేసేవారు మాత్రమే ‘కార్మికులు’ అవుతారు.

‘శ్రమ దోపిడీ’ సాగే సమాజంలోనే, యజమాని పెత్తనం లేకుండా, ‘జీతం’ పద్ధతి కూడా లేకుండా, ‘సరుకు’ తయారీ కోసం, రోజుకి ఫలానా ఇన్ని గంటల పద్ధతి లేకుండా, స్వతంత్రంగా ఏవో ఒకటి రెండు శ్రమలు చేస్తూ, తమ సరుకుని, అమ్మడంలో, పెట్టుబడిదారీ సరుకుల ధరలతో పోటీలు పడలేని స్థితిలో, ఆ ధరలకన్నా తక్కువ ధరలతోనే తమ సరుకుని అమ్ముకుంటూ, ఆ ఆదాయాన్ని, అది తక్కువైనా, ఎక్కువైనా, ఎంతైనా, దాన్ని తమ శ్రమ ఫలితంగా పొందే వారు ‘స్వంతంత్ర శ్రామికులు’ అవుతారు. యజమాని పెత్తనం లేని, ‘జీతం’ విధానమే లేని, ‘శ్రమ దోపిడీ’ పద్ధతి లేని, అమ్మకాల కోసమే జరిగే సరుకు విధానం లేని, అమ్మకాలూ-కొనడాలూ లేని, ‘డబ్బు విధానం’ లేని, అవసరాలకు తగిన విధంగా ఉత్పత్తిల్ని పొందే లక్షణాలు గల సమానత్వ మానవ సంబంధాల నూతన ఉత్పత్తి విధానం ఈ నాటికీ లేకపోయినా, కార్మికవర్గ చైతన్యం ద్వారా భవిష్యత్తులో ఏర్పడబోయే ‘సమిష్టి ఉత్పత్తి విధానం’లో అంటే సమానత్వ శ్రమ సంబంధాల సమాజంలో జీవించే మానవులందరూ ‘సమిష్టి ఉత్పత్తి దారులు’ (‘ఎస్సోసియేటెడ్‌ ప్రొడ్యూసర్స్‌’) అవుతారు. అయితే, ‘శ్రమ దోపిడీ’లేని నూతన సమాజం ఇంకా ఈనాడు లేదు కాబట్టి, ఈనాటి సమాజంలో ఏ మానవులూ ‘సమిష్టి ఉత్పత్తి దారులు’ కాలేరు.

ఇప్పుడు, మార్క్సూ-ఎంగెల్సులు వేతన కార్మికులా, స్వతంత్ర ఉత్పత్తి దారులా అనే విషయం చూడాలి. దాని కోసం మనకి, మార్క్సూ ఎంగెల్సులు ఏ రకం పనులు చేశారు, ఏమైనా ఉద్యోగాలు చేశారా?-వంటి సమాచారం తెలిసి వుండాలి.

మార్క్సు జర్మనీలో ఒక లాయరు కొడుకు. వాళ్ళ ఆస్తి వివరాలు తెలియవు. (”డబ్బూ, సంస్కారమూ వున్న కుటుంబం అది, కానీ విప్లవకరమైనది కాదు” -లెనిన్‌.) మార్క్సుకి స్కూలు నుంచీ మొదలు పెట్టి, యూనివర్సిటీలో చిట్టచివరి డిగ్రీ పీహెచ్‌.డీ వరకూ చదువు సాగింది. అతని అప్పటి అభ్యుదయభావాలను భరించలేని యూనివర్సిటీలలో అతనికి ఉద్యోగం దొరకలేదు. ఇక రచనా వ్యాసాంగమే. అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వున్న ఒక ”ప్రతిపక్ష పత్రిక”కు ఎడిటర్‌ గా కొన్నాళ్ళు పని చేశాడు. ప్రభుత్వం విధించిన సెన్సార్‌ షిప్‌ కారణంగా ఆ పత్రికకి రాజీనామా చేశాడు. తర్వాత కొంత కాలానికి పారిస్‌ వెళ్ళి అక్కడ ఇంకొకరితో కలిసి ఒక పత్రిక ప్రారంభిస్తే, ఆ ఇంకో వ్యక్తితో కుదరక, కొన్నాళ్ళకి ఆ పత్రిక ఆగిపోయింది. మార్క్సు కున్న పాలక వర్గ వ్యతిరేక భావాల వల్ల, జర్మనీ నుంచీ, ప్రాంసూ, బెల్జియం… అలా దేశ బహిష్కరణలు జరిగీ, జరిగీ, చివరికి లండన్‌ చేరి, చివరిదాకా అక్కడే వున్నాడు. అక్కడి నుండి అమెరికాలో వున్న ‘న్యూయార్క్‌ డైలీ ట్రిబ్యూన్‌’ పత్రికకి కాలమిస్టుగా వారానికి రెండు వ్యాసాలు రాస్తే, వాళ్ళిచ్చే అతి తక్కువ డబ్బుతో బ్రతకాల్సి వచ్చేది. ఆ పేదరికం ఎటువంటిదంటే, ఇంట్లో వున్న కొన్ని రకాల సామాన్లనీ, ఆఖరికి మార్క్సు ఒంటి మీద బట్టల్నీ తాకట్టు పెట్టి కొంత డబ్బు తెచ్చుకునేవారనే విశేషాలు కూడా చదివాం.

మార్క్సు రాసిన వాటికి, పత్రికల వాళ్ళు ఇచ్చేది గానీ, ప్రచురణ కర్తలు ఇచ్చేది గానీ, కనీసంగా అయినా సరిపోయేది కాదు. అప్పటి ఆర్థిక ఇబ్బందుల గురించి మార్క్సు భార్య జెన్నీ, ఆప్తులకు రాసిన ఉత్తరాల్లోనూ, ఆమె రాసుకున్న ఆత్మకథలోనూ చూడవచ్చును. (మార్క్సు ఎంగెల్సుల గురించిన స్మతులు. ప్రగతి ప్రచురణాలయం, మాస్కో, 1974.) ఒక ఉత్తరంలో.. ”రెవ్యూ’ (పత్రిక) నుంచి మీకు డబ్బేదైనా అంది వుంటే, లేక అందితే, మాకు వీలైనంత త్వరలో పంపాలని ప్రార్థిస్తున్నాను. డబ్బు మాకు చాలా చాలా అవసరంగా వుంది.. ‘రెవ్యూ’ ప్రచురించ బడినప్పుడు, మా స్వల్ప ఆదాయం అయిపోయింది. ఒప్పందానికి వ్యతిరేకంగా, మాకు డబ్బు యివ్వలేదు. తరువాత చిన్న చిన్న మొత్తాలుగా మాత్రమే యిచ్చినారు. ఫలితంగా యిక్కడ మా పరిస్థితి మహా భయం గొలిపేదిగా వుండింది. నేను ఆ జీవితంలో ఒక్క రోజును మాత్రం వర్ణిస్తాను, సరిగ్గా యెలా జరిగిందో అలాగ! …మా దగ్గర అప్పుడు డబ్బు లేనందున యిద్దరు అమీనాలు వచ్చి నా కుండిన కొద్ది వస్తువులన్నీ జప్తు చేసినారు- గుడ్డలూ, పడకలూ, దుస్తులూ, ప్రతిదీ-పసిబిడ్డ ఉయ్యెల కూడా, అక్కడ నిలబడి ఆవురుమని యేడుస్తున్న మా కూతుర్ల మంచి మంచి ఆటవస్తువులు కూడా. వాళ్ళు రెండు గంటలలో తీసుకుపోతామని బెదిరించినారు. అప్పుడిక నేను చలికి గడ్డకట్టుకుపోయే మా పిల్లలతో, కటిక నేలమీద పండుకొనవలసి వచ్చేది. మా మిత్రుడు ‘ష్రామ్‌’ మాకు సహాయం తీసుకురావడానికి నగరంలోకి ఉరికినాడు. అతను గ్రురపు బండిలో యెక్కినాడు, కానీ గుర్రాలు బెదురుకున్నాయి, అతను కిందికి దుమికినాడు. రక్తపు గాయాలతో అతన్ని యింట్లోకి తెచ్చినారు, వణికే పిల్లలతో నేను యేడుస్తూ వుండిన చోటికి. మరుదినం మేము యిల్లు వదలి పెట్టవలసి వచ్చింది. ఆ రోజు చలిగా, వర్షం పడుతూ, కాంతి హీనంగా వుండింది. నా భర్త మాకు విడిది కోసం ప్రయత్నించినాడు. నలుగురు పిల్లలు వున్నారని ఆయన చెప్పగానే యెవరూ మాకు విడిది యివ్వరు. చివరకొక మిత్రుడు మాకు సాయం చేసినాడు. మేము అద్దె చెల్లించి, తొందరగా మా పడకలన్నీ అమ్మి, మందుల షాపు వానికీ, బ్రెడ్డు వర్తకునికీ, మాంస వర్తకునికీ, పాల వాళ్ళకూ డబ్బు చెల్లించినాము. వాళ్ళు జప్తు దశ్యం చూసి భయపడి, హఠాత్తుగా తమ బిల్లులతో నన్ను చుట్టుముట్టినారు.” (పేజీ: 186-87)

”నేను (మశూచి నుంచీ) మంచం వదలగలిగిన వెంటనే నా ప్రియమైన కార్ల్‌ (మార్క్సు) జబ్బు పడినాడు. మితిమీరిన ఆందోళనా, రకరకాల దిగుళ్ళూ, వ్యధలూ ఆయన్ను మంచం పట్టించినాయి. ఆయన దీర్ఘ లివర్‌ వ్యాధి మొదటి సారి తీవ్రమైంది. నాలుగు వారాల బాధ తర్వాత ఆయన జబ్బు నయమైంది. ఆ మధ్యలో ‘ట్రిబ్యూన్‌’మళ్ళీ ఆదాయాన్ని సగం చేసింది. కార్ల్‌ పుస్తకానికి డబ్బు రావడానికి బదులు మేము ఒక విదేశీ మారకం బిల్లు చెల్లించవలసి వచ్చింది. దానికి తోడు, ఆ భయానక వ్యాధికి అపారమైన ఖర్చులు తగిలినాయి. ఆ శీతాకాలం మా పరిస్థితి మీరు ఊహించుకోగలరు.” (పేజీ: 194)

”లూయీ నెపోలియన్‌ రాజకీయ కుట్ర 1851 అంతంలో జరిగింది. మరు సంవత్సరం కార్ల్‌ తన ‘బ్రూమేర్‌ పద్దెనిమిదవ తేదీ’ రాసినాడు. అది న్యూయార్కులో ప్రచురించ బడింది. అది ఆయన డీన్‌ స్ట్రీట్‌లోని మా చిన్న యింటిలో పిల్లల గోలమధ్య, కుటుంబపు రొద మధ్య రాసినాడు. మార్చికల్లా నేను రాత ప్రతిని యెత్తిరాసినాను. దాన్ని పంపించివేసినాము. కానీ చాలా కాలం తర్వాతగానీ అది అచ్చులో రాలేదు. దాని ద్వారా మాకు వచ్చింది దాదాపు శూన్యం.” (పేజీ: 176)

”మా ముద్దు బిడ్డ మరణం అత్యంత కఠినమైన కడగండ్ల కాలంలో జరిగింది. సరిగా అప్పుడు మా జర్మన్‌ మిత్రులు సాయం చేయలేని స్థితిలో వుండినారు. దాదాపు ఆ కాలంలో మమ్మల్ని చూడడానికి తరుచుగా వచ్చి, చాలా సేపు వుంటూ వుండిన ఎర్నెస్ట్‌ జోన్స్‌ మాకు సాయం చేస్తానని వాగ్దానం చేసినాడు. కానీ అతను మాకు యేమీ తేలేక పోయాడు.. హృదయంలో వ్యధతో నేను ఒక ఫ్రెంచి ప్రవాసి వద్దకు పరుగెత్తినాను. అతను మా ఇంటికి అనతి (దగ్గిర) దూరంలో వుండినాడు. మమ్మల్ని చూడడానికి తరుచూ వచ్చేవాడు. మా భయంకరమైన అవసరంలో మాకు సాయం చేయమని అతన్ని అర్ధించినాను. అత్యంత సుహద్భావపు సానుభూతితో అతను వెంటనే నాకు రెండు పౌండ్లు యిచ్చినాడు. ఆ డబ్బు శవపేటికకు ఖర్చు పెట్టినాము. అందులో నా బిడ్డ విశ్రమిస్తున్నది. ఆ బిడ్డ యీ ప్రపంచం లోకి వచ్చినప్పుడు ఉయ్యెల లేదు. ఆమెకు చివరి విశ్రాంతి స్థానం చాలా కాలం నిరాకరించబడింది. మేము యెంత బరువైన గుండెలతో ఆమెను సమాధికి పంపినామో!” (పే: 176-77)

”1853వ సంవత్సరంలో కార్ల్‌ ‘న్యూయార్క్‌ డైలీ ట్రిబ్యూన్‌’కు క్రమం తప్పకుండా రెండు వ్యాసాలు రాసేవాడు. అది అమెరికాలో పెద్దగా ప్రజల దృష్టిని ఆకర్షించినాయి. యీ స్థిర మైన ఆదాయం ద్వారా మేము మా పాత ఆస్తులు కొంతవరకు తీర్చడానికీ, కొంత దిగులు లేని జీవితం గడపడానికీ సాధ్యమైంది.” (పేజీ: 177)

”1857 మధ్యలో మరొక గొప్ప వర్తక సంక్షోభం అమెరికన్‌ కార్మికులను యెదుర్కొంది. మళ్ళీ ‘ట్రిబ్యూన్‌’వారానికి రెండు వ్యాసాలకు డబ్బు యివ్వడానికి నిరాకరించింది. తత్ఫలితంగా మా బడ్జెట్‌లో గణనీయమైన కోత పడింది. అదృష్టవశాత్తూ ‘డాన’ అప్పుడు ఒక విజ్ఞాన సర్వస్వం (ఎన్‌ సైక్లోపీడియా) ప్రచురిస్తూ వుండి, మిలిటరీ సమస్యల మీదా, ఆర్థిక సమస్యల మీదా, వ్యాసాలు రాయమని కార్ల్‌ను కోరినాడు. కానీ, ఆ వ్యాసాలు చాలా క్రమ రహితంగా వుండినందువలనా, పెరిగే పిల్లలూ, పెరిగిన సంసారమూ ఖర్చులను పెంచినందువలనా, ఆ కాలం యేవిధంగానూ సౌభాగ్యవంతమైనది కాదు. అది పరమ దరిద్రం కాదు గానీ, మాకు నిత్యం యిబ్బందిగా వుండేది. చిల్లర భయాలతోనూ, లెక్కాచారలతోనూ బాధపడే వాళ్ళం. మా ఖర్చులు యెంత తగ్గించుకున్నా, మా ఆదాయం ఖర్చులకు సరిపడేది కాదు. మా అప్పులు దినదినానికీ, యేటికేటికీ పెరుగుతూ వచ్చినాయి.” (పేజీ: 179)

”1861లో… ఆయన (మార్క్సు) తన పినతండ్రి లియోన్‌ ఫిలిప్స్‌ను చూడడానికి హాలండుకు పోయినాడు. అతను నిజమైన గొప్ప బుద్ధితో ఈయనకు (మార్క్సుకు) వడ్డీ లేకుండా కొంత డబ్బు అప్పు యిచ్చినాడు… అప్పుదొరికినందున కొన్నాళ్ళ పాటు మా సంసార నౌక సుఖంగా సాగింది. నిత్యం కొండలకూ, యిసుక దిబ్బలకూ మధ్యనే, సుడిగుండాల అంచుననే అయినప్పటికీ.” (పేజీ: 181)

”మా పాత, విశ్వాసం గల ఆప్త మిత్రుడు లూవూస్‌.. 1864 మే 9న మరణించినాడు. అతని వీలునామాలో, కొందరు చిల్లర వారసులు కాక, కార్ల్‌నూ, నన్నూ, మా పిల్లలనూ ప్రధాన వారసులుగా రాసినాడు. మితంగా జీవించే ఆ సరళ వ్యక్తి అమితమైన పరిశ్రమ ద్వారా 1000 పౌండ్ల మంచి మొత్తం మిగిలించి వుంచినట్లు తేలింది. తన జీవిత శ్రమ ఫలితాన్ని ప్రశాంతమైన, సుఖ ప్రదమైన వృద్ధాప్యంలో అనుభవించే ఊరట అతనికి లేకపోయింది. అతని ద్వారా మాకు సహాయమూ, ఉపశమనమూ, దిగులు లేని ఒక యేడాది లభించినాయి.” (పేజీ: 183)

”అన్ని దిక్కులా పీడింపబడుతూ, రుణ దాతలు వెంటబడుతుండగా, మేము అక్కడ చాలా కాలం వుండలేదు… మా అమ్మ నుండి వచ్చిన స్వల్ప సహాయం అత్యంత దారుణమైన కడగండ్ల నుండి మమ్మల్ని రక్షించింది.” (పేజీ: 174)

ఇదీ లండన్‌లో మార్క్సు కుటుంబ ఆర్ధిక పరిస్థితి. నిరంతరం కార్మిక వర్గ ప్రయోజనాల కోసం ఆర్ధిక రాజకీయ విషయాల మీద పరిశోధనల్లో మునిగి పోయిన మార్క్సు, ఒక స్థిరమైన జీతం వచ్చే ఉద్యోగం ఏదీ చెయ్యలేదు. అలా చేసివుంటే, అతను ఒక ‘వేతన కార్మికుడు’ అయివుండే వాడు. కాకపోతే, మేధా శ్రమ చేసే కార్మికుడయ్యే వాడు. అడపా దడపా పత్రికలకి రాసినప్పుడు గానీ, ప్రచురణకర్తలకి రచనలు ఇచ్చినప్పుడు గానీ మార్క్స్‌, యజమాని లేని స్వతంత్ర శ్రామికుడిగా వున్నట్టు లెక్క.
ప్రపంచ కార్మిక వర్గ ప్రయోజనాల కోసం పూర్తి కాలం రచనలు చేస్తూ వుండిన విప్లవ కారుడికి స్నేహితులు తమ ఆదాయాల్లో నుంచీ కొంత సర్దు బాటు చెయ్యడం అది.

ఎంగెల్సు గురించి చూస్తే, ఈయన పరిశ్రమలు గల పెట్టుబడిదారుడి కుటుంబంలోనే పుట్టి, అనేక సౌకర్యాలతో పెరిగిన వాడు. ఈయనకి కూడా అప్పటి జర్మనీ రాజకీయాల మీద కొన్ని విమర్శలు వుండేవి.
మార్క్సు కన్నా ఎంగెల్సు రెండేళ్ళు వయసులో చిన్న. పత్రికల్లో మార్క్సు రచనలు చదివే ఎంగెల్సు, తన 22వ ఏట మార్క్సుని కలిసినప్పుడు, ఆ కలయిక ఇద్దరి భావాలూ అంతగా కలిసినట్టు కనపడలేదు.
జర్మనీలో వున్న తన తండ్రికి, ఇంగ్లండులోని మాంచెస్టర్‌ నగరంలో ఒక పరిశ్రమలో వాటా వుంటే, దాన్ని చూసుకునే పనిమీద అక్కడికి వెళ్ళాడు. ఆ పరిశ్రమలో పని చేసినందుకు ఒక జీతం అందేదీ. ఆ ఆస్తిలో ఒక వాటా అనేది కూడా వుండేది.

ఎంగెల్సు, తమ పరిశ్రమ బాధ్యతలు చూసుకుంటూనే, లండన్‌లో కార్మికవాడల్లో తిరుగుతూ, కార్మికుల ఇరుకు ఇళ్ళను చూస్తూ, వారి జీతాల గురించీ, ఖర్చుల గురించీ వారితో మాట్లాడుతూ, అంతవరకూ చూడని, ఎరగని కొత్త సంగతులు తెలుసుకుంటూ, తను చూసిన సమాచారాన్నంతా ఎప్పటికప్పుడు మార్క్సుకి రాస్తూ వుండే వాడు.

మార్క్సుని రెండో సారి కలిసేటప్పటికి, అప్పటివరకూ సాగిన ఉత్తరాల స్నేహంతో ఇద్దరి భావాలూ ఒకటై, ఒకరి కొకరు నమ్మకస్తులై, ఒకరికొకరు ప్రాణ స్నేహితులయ్యారు.

ఎంగెల్సు తన 24వ యేట, ”ఇంగ్లండులో కార్మిక వర్గ స్తితిగతులు” అనే పేరుతో ఆ కార్మికుల దయనీయ జీవితాల గురించీ, వారి పోరాటాల గురించీ, తనకు తెలిసిన సమాచారంతో ఒక పుస్తకం రాశాడు. అప్పటికే, మార్క్సు ‘శ్రమ దోపిడీ’ గురించి పూర్తిగా తెలుసుకోక పోయినా, కార్మిక జనాభా అనుభవించే సమస్యల గురించి ఇద్దరూ గాఢమైన సంఘీభావంతో చర్చించుకునేవారు.

ఎంగెల్సుకి, తమ ‘పరిశ్రమ’లో పని చెయ్యడం వ్యతిరేకం అవుతూ వున్నా, మార్క్సు కుటుంబానికి కొంత డబ్బు పంపుతూ వుండడం అత్యవసరమై, పరిశ్రమ పనుల్లోనే ఆగి పోయాడు.

ఈ విషయమై, మార్క్సు పెద్ద కూతురు కొడుకు ‘ఎడ్గార్‌ లొంగే’ తన జ్ఞాపకాలలో ఇలా రాశాడు. ”ఎంగెల్సు మాంచెస్టర్‌లో తన తండ్రి వ్యాపారంలోని బ్రాంచిని నిర్వహించడానికీ, తనకు తల భారంగా వుండిన వ్యాపారం నడపడానికీ తన జీవిత కాలంలో అత్యధిక భాగంలో తనకు తాను అన్యాయం చేసుకున్నాడు. ఈ పనికి గల కారణమల్లా యేమిటంటే, మార్క్సుకు సహాయం చేయగలగడమూ, మార్క్సు తన పనిని నిర్వహించేటట్లు చేయగలగడమూ. ఎంగెల్సు లేకపోతే, మార్క్సూ, ఆయన కుటుంబమూ పస్తులు వుండే వాళ్ళు- అందుకు సందేహం లేదు.” (పేజీ: 219)

మార్కు, ఎంగెల్సుకి రాసిన ఒక ఉత్తరంలో ఇలా రాశాడు: ”ఈ మధ్య నేను అనుభవించిన భయంకరమైన బాధల్లో, నీ మైత్రిని గురించిన ఆలోచనా, మనమింకా ఈ భూమి మీద తెలివిగల పని చేయవలసి వుందన్న విశ్వాసమూ నన్ను ఆదుకున్నాయి.” (పేజీ: 221)

లండన్‌లో జీవించినంత కాలమూ, ఎంగెల్సు పంపిస్తూ వుండిన డబ్బు మార్క్సుకి చాలా సహాయ పడింది. ”ఎంగెల్సు చేసిన స్వార్ధత్యాగ పూరితమైన నిరంతర ఆర్ధిక సహాయం లేకపోతే, మార్క్సు ‘పెట్టుబడి’ని పూర్తి చేయలేకపోవడమే గాక, దారిద్య్రంతో తప్పకుండా నశించిపోయి వుండే వాడు.”- అని ఎంగెల్సు మీద రాసిన ఒక వ్యాసంలో లెనిన్‌ అంటాడు.

మార్క్సు తన కాలం అంతా, లండన్‌ లైబ్రరీలో కూర్చుని వెనకటి ఆర్ధిక వేత్తలు రాసిన ఆర్ధిక శాస్త్ర విషయాలన్నీ రాసుకోవడం తోనే గడిపేవాడు. ఆ కృషితోనే, పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంలో, ‘జీతం’పద్ధతిని ఆధారం చేసుకుని ‘అదనపు విలువ’ రూపంలో జరిగే ‘శ్రమ దోపిడీ’ని వివరించగలిగాడు.
మార్క్సు 64వ యేటనే తీవ్ర అనారోగ్యంతో మరణించాడు. అప్పటికి ‘కాపిటల్‌’ మొదటి సంపుటం తప్ప, మిగతా సంపుటాలు అచ్చులోకి రాలేదు. అవి నోట్సులుగానే వుండిపోయాయి. ఇక, వాటిని ఫైనల్‌ చేసే పని ఎంగెల్సు చూశాడు. ఈ పని కోసం, మార్క్సు వున్న కాలంలోనే ఎంగెల్సు ‘పరిశ్రమ’లో పని మానుకున్నాడు. ఆస్తిలో తన వాటాని అమ్మేసి, ఆ డబ్బుని కూడా తన కుటుంబానికీ, మార్క్సు సమస్యలకీ, ఉపయోగించాడు.

ఈ ఇద్దరూ చేసిన శ్రమ అంతా ‘కాపిటల్‌’ సంపుటాల కోసమే గాక, ఇంకా ఇతర పుస్తకాలకీ, అంతర్జాతీయ కార్మిక సంస్థకీ కూడా.

ఈ ఇద్దరి శ్రమలూ ఏ ‘సరుకుల’ ఉత్పత్తి కోసమూ కాదు. కాబట్టి, వీరు ‘వేతన కార్మికులు’గా గానీ, ‘స్వతంత్ర శ్రామికులు’గా గానీ అవరు. అయితే, మరణించే కాలం వరకూ మేధా శ్రమలు చేస్తూనే వున్న వీరు, ఏ కోవకి చెందుతారు?

కౌళ్ళూ, వడ్డీలూ, లాభాల వల్ల వచ్చే మోసకారి ఆదాయాలతో ‘శ్రమ దోపిడీ’ జరిగే సమాజం, అన్ని కోణాలలోనూ మారే విధంగా, ‘కార్మిక వర్గవిముక్తి’ కోసం, ‘వర్గ భేదాలు లేని’ సమాజం కోసం, మానవులందరూ తెలుసు కోవలిసిన విజ్ఞానాన్ని అందించే రచనలు చేయడానికే తమ ‘మేధా శ్రమలను’ వెచ్చించిన ఈ మార్క్సు-ఎంగెల్సులిద్దరూ శ్రామిక వర్గ విప్లవ కారులవుతారు!

Courtesy Nava Telangana

Search

Latest Updates