- చెప్పిన పని చేయకుంటే నోటీసులు, సస్పెన్షన్లు
- తీర్మానాల్లేకుండా డైరెక్ట్గా పనులు
- మిత్తీలకు తెచ్చి పనులు చేస్తున్నా సతాయింపులే
- రెండేండ్లుగా బిల్లులు ఇవ్వని సర్కారు
- ఏకగ్రీవాలకు 15 లక్షలు ఇంకా ఇయ్యలే
- పంచాయతీ సిబ్బందికి జీతాలివ్వలేని పరిస్థితి
జయశంకర్ భూపాలపల్లి: పేరుకే సర్పంచ్లు..! ఊరిలో ఒక నల్లా పెట్టించలేరు.. ఒక స్ట్రీట్ లైటు వేయించలేరు.. ఒక రేషన్ కార్డు ఇప్పించలేరు.. ఒక పింఛన్ రాయించలేరు. ఆఖరికి మోరీలకెంచి బురద కూడా తీయించలేరు!! అన్నిట్లా రాష్ట్ర సర్కారుదే పెత్తనం. ప్రభుత్వం తరఫున ఆఫీసర్లదే పెద్దరికం. ఆఫీసర్లు చెప్పిన దానికి ‘ఊ..’ కొట్టకపోతే షోకాజ్ నోటీసులు.. ఇంకేమన్నా అంటే పదవి ఊస్టింగ్! కొత్త పంచాయతీరాజ్ చట్టం వచ్చాక రాష్ట్రంలోని సర్పంచుల చేతుల్లో పవర్, పైసలు రెండూ లేకుండా పోయాయి. ఊళ్లకు మస్తు నిధులిస్తున్నామని చెప్పుకుంటున్న సర్కారు.. వాస్తవానికి ఒక్క పైసా కూడా ఇవ్వడం లేదని సర్పంచ్లు అంటున్నారు. ఆఫీసర్లు చెప్పిన పనుల కోసం అప్పులు తెచ్చి ఖర్చు పెట్టాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇట్ల అభివృద్ధి పనుల కోసం ఒక్కో సర్పంచ్ మీద రూ. 10 లక్షల నుంచి 30 లక్షల దాకా అప్పులు మోపయ్యాయి. అప్పులోళ్ల బాధకు కొందరు సర్పంచ్లు ఇంట్ల నుంచి బయటకు కూడా రావడం లేదు.
సెంట్రల్ ఫండ్స్పైనా సర్కార్దే అజమాయిషీ
రాష్ట్రానికి సీఎం ఎట్లనో, ఊరికి సర్పంచ్ అట్ల. అధికార పార్టీ ఎమ్మెల్యేలు తలుచుకుంటే సీఎం మారుతడేమోగాని, ప్రజలతో డైరెక్ట్గా ఎన్నికైన సర్పంచ్ను మార్చడం వార్డు సభ్యుల తరం కాదు. గ్రామ స్వపరిపాలన కాన్సెప్ట్తో గత ప్రభుత్వాలు తెచ్చిన చట్టాలు, సర్పంచ్కు ఇలా చెప్పుకోదగిన పవర్స్ కట్టబెట్టడితే టీఆర్ఎస్ సర్కారు మాత్రం వాళ్లను రబ్బర్ స్టాంపుల్లా మార్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రంలో 12,751 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఒక్కో ఊరి అవసరాలు ఒక్కో రకంగా ఉంటాయి. అందుకు తగిన నిర్ణయాలు తీసుకునేలా సర్పంచ్కు గతంలో ప్రత్యేక పవర్స్ ఉండేవి. ఊరిలో సమస్యలను గుర్తించడం, గవర్నింగ్బాడీలో చర్చించడం, విలేజ్ అసెంబ్లీ తీర్మానాల మేరకు గ్రాంట్స్ ఖర్చు పెట్టి డెవలప్మెంట్ వర్క్స్ చేయడం సర్పంచుల మెయిన్ డ్యూటీగా ఉండేది. కానీ పంచాయతీరాజ్ యాక్ట్‒2018 తర్వాత ఊళ్లలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యక్ష జోక్యం పెరిగింది. ఊళ్ల అవసరాలను బట్టి అభివృద్ధి చేసుకునే వెసులుబాటు, గ్రామ సభల్లో చర్చించి తీసుకునే నిర్ణయాలు లేకుండా పోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ఇచ్చే ఫండ్స్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం తన అవసరాలకు మళ్లిస్తోంది. తనకు నచ్చిన పనులనే చేయిస్తూ సకాలంలో బిల్లులు ఇవ్వకుండా సర్పంచులు తన దిక్కు ఆశగా ఎదురుచూసే పరిస్థితి కల్పిస్తున్నది. ఉదాహరణకు కేంద్రం ఇచ్చే ఈజీఎస్ ఫండ్స్తో ఊళ్లలో రైతువేదికలు, శ్మశాన వాటికలు, విలేజ్ పార్క్లు, డంపింగ్యార్డులను నిర్మించే బాధ్యతను సర్పంచులపై పెట్టారు. గవర్నమెంట్ ల్యాండ్ లేకున్నా, ఫండ్స్ రాకున్నా సకాలంలో పనులు పూర్తిచేయాలని టార్గెట్లు పెట్టి మరీ వేధిస్తున్నారని సర్పంచులు వాపోతున్నారు.
పనికిరాని చోట కడుతున్నా..
అసైన్డ్ ల్యాండ్స్ కూడా లేని చాలా ఊళ్లలో టార్గెట్ల కోసం ఆఫీసర్లు వాగులు, చెరువుల్లో శ్మశాన వాటికలు, డంపు యార్డులను, స్కూళ్లు, కాలేజీ గ్రౌండ్లలో విలేజ్ పార్కులను కట్టించారు. సర్పంచులు మొత్తుకున్నా స్థల సేకరణలో ఆఫీసర్లే ఫైనల్ డెసిషన్ తీసుకున్నారు. తీరా మొన్నటి వర్షాలకు వాగుల్లో, చెరువుల్లో కట్టిన నిర్మాణాలు నీటమునగడంతో సర్పంచులను పబ్లిక్ తిడుతున్నారు. విలేజ్ పార్కులను స్కూలు ఆవరణల్లో పెట్టడంతో హెడ్మాస్టర్లు, టీచర్లు వచ్చి విమర్శిస్తున్నారు.
వీధిలైట్లూ కాంట్రాక్ట్ సంస్థలకే
ఊళ్లలో వీధిలైట్ల ఏర్పాటు, నిర్వహణ, బిల్లుల చెల్లింపు బాధ్యతలను కూడా రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ సంస్థలకు కట్టబెడుతోంది. ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు, ఎక్కడ ఏ లైటు పాడైనా కాంట్రాక్ట్ సంస్థలే రిపేరు చేస్తాయి. కరెంట్ బిల్లులు కూడా అవే కడుతాయి. అయితే.. ఆ కంపెనీకి ప్రతి నెలా గ్రామ పంచాయతీ నుంచి చెక్కులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం జీవో నెం.64 జారీ చేశారు. ఇలా గ్రామాల్లో తమకు తెలియకుండానే అన్ని పనులు జరుగుతున్నా యని, ఎక్కడ తేడా కొట్టినా తామే బాధ్యత వహించాల్సి వస్తోందని, సర్కారు తీరుతో జనాల్లో పలుచన అవుతున్నామని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భూములు లాక్కుంటున్నా.. కిమ్మనకూడదు..!
రైతువేదికలు, విలేజ్పార్కులు తదితర నిర్మాణాలకు ఊళ్లలో సరిపడా భూములు లేవు. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు గత ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్డ్ భూములను ఆఫీసర్లు లాక్కుంటున్నారు. టైమూ, టార్గెట్లు తప్ప మరేదీ పట్టించుకోని ఆఫీసర్లు.. రాత్రికి రాత్రే పొలాలను దున్ని, ఇండ్లు, గుడిసెలు కూల్చి ల్యాండ్స్ స్వాధీనం చేసుకుంటున్నారు. దీంతో బాధితులంతా సర్పంచ్లను నిలదీస్తున్నారు. ‘‘నిన్ను సర్పంచ్గా గెలిపిస్తే ఉన్న భూములు గుంజుకుంటావా?’’ అని వాళ్లు అడుగుతుంటే ఏమి చెప్పాలో తెలియక సర్పంచులు ఇబ్బందిపడుతున్నారు. తమ కండ్ల ముందే పేదల నోట్లో మట్టి కొడుతున్నా చూస్తూ ఊరుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ట్రాక్టర్ల కొనుగోలులో ఇష్టారాజ్యం
అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో చెత్త ఎత్తడానికి రూ. 5 లక్షలు పెట్టి కొత్త ట్రాక్టర్, రూ. 1.88 లక్షలు పెట్టి ట్రేలర్, రూ. 1.83 లక్షలు పెట్టి ట్యాంకర్ కొనుగోలు చేశారు. ఆయా కంపెనీలకు ఒకేసారి చెక్కులిచ్చారు. దీంట్లో సర్పంచ్లకు గానీ గ్రామ పంచాయతీకి గానీ సంబంధమే లేదు. ట్రాక్టర్ ఏ షోరూంలో కొనాలో? ట్రాక్టర్ డబ్బా, ట్యాంకర్ ఎక్కడ తయారుచేయించుకోవాలో? ప్రభుత్వ ఆఫీసర్లే సూచించారు. ఆఫీసర్లు చెప్పిన మొత్తానికి చెక్కులు రాసిచ్చే బాధ్యత మాత్రమే సర్పంచ్లపై వేశారు. ట్రాక్టర్ నడిపే డ్రైవర్ జీతం, ప్రతి రోజు డీజిల్ ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావడం లేదు. దీంతో నిర్వహణ భారమై కొందరు సర్పంచ్లు ట్రాక్టర్లను పక్కన పడేశారు.
నీళ్లు రాకున్నా చేసేదేమీ లేదు
మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి నల్లాలు ఏర్పాటు చేస్తామని ఇప్పటికే ఉన్న నల్లాలను ధ్వంసం చేశారు. ఊళ్లలో కొన్ని కాలనీల్లో పైప్లైన్లే వేయలేదు. దీంతో నీటి సరఫరాపై సర్పంచులను ప్రజలు నిలదీస్తున్నారు. ఎక్కడన్నా మిషన్ భగీరథ పైప్లైన్ పగిలిపోతే రిపేర్ బాధ్యతలు కూడా సర్పంచ్లకు లేదు. వారం, పది రోజులైనా మిషన్ భగీరథ ఆఫీసర్లే చేయాలి. అప్పటికే ప్రజల నుంచి సర్పంచ్లకు ఛీత్కారాలు.. చివాట్లు పడుతున్నాయి.
రేషన్కార్డు కూడా ఇప్పించలేరు
గ్రామ పంచాయతీ ఎన్నికలు 2019 జనవరిలో జరిగాయి. అంటే.. ఇప్పుడున్న సర్పంచులు ఎన్నికై దాదాపు రెండేండ్లు కావస్తోంది. ఆసరా పింఛన్ వయసును ప్రభుత్వం 60 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గించింది. దీంతో 2019 జనవరి నాటికి జీహెచ్ఎంసీని మినహాయించి 6.50 లక్షల మంది, మిగిలిన దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులు తదితర కేటగిరీల్లో కలిపి మరో 2 లక్షల 81 వేల మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. కొత్త రేషన్కార్డుల కోసం జిల్లాల్లో 6 లక్షల మంది ఎదురుచూస్తున్నారు. వీళ్లంతా తమకు పింఛన్లు, రేషన్కార్డులు ఇప్పించాలని రోజూ సర్పంచుల చుట్టూ తిరుగుతున్నారు. సర్కారు మంజూరు చేయకున్నా సర్పంచులనే జనం తప్పుపడుతున్నారు. సర్పంచ్గా ఎన్నుకుంటే కనీసం పింఛన్ కూడా ఇప్పించలేవా? రేషన్ కార్డు కూడా ఇప్పించలేవా? అని ప్రశ్నిస్తున్నారు.
పెంచిన జీతాలు ఇచ్చేదెలా?
రాష్ట్ర సర్కారు పంచాయతీ ఉద్యోగుల జీతాలను రూ. 8,500కు పెంచింది. అయినా వీరి జీతాల కోసం చిల్లి గవ్వ కూడా ప్రభుత్వం తన ఖజానా నుంచి ఇవ్వట్లేదు. గ్రామ పంచాయతీలే ఇవ్వాలని ఆదేశించింది. దీంతో సిబ్బంది జీతాలు ఇవ్వలేక కొందరిని ఉద్యోగాల నుంచి తొలగించాల్సి వచ్చిందని సర్పంచ్లు అంటున్నారు. ఇలా ఉద్యోగాల నుంచి తొలగించినందుకు వాళ్ల దృష్టిలో తాము విలన్లుగా మారిపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బ్లీచింగ్ పౌడరూ కొనలేరు
మురికి నీటి కాల్వలు, బురద ప్రాంతాల్లో చల్లే బ్లీచింగ్పౌడర్ సంచులను కూడా పైనుంచి కొని పంపిస్తున్నారు. బస్తాల సంఖ్య ఆధారంగా కంపెనీకి చెక్కులు రాసి పంపించాలని సర్పంచ్లపై ఒత్తిడి తెస్తున్నారు. కంపెనీ ఏదైనా, క్వాలిటీ లేకపోయినా సర్పంచులు కిమ్మనట్లేదు.
మిత్తికి తెస్తే బిల్లులు వస్తలేవు..
ఆఫీసర్ల ఒత్తిడితో సర్పంచులంతా మిత్తికి పైసలు తెచ్చి డెవలప్మెంట్ వర్క్స్ చేస్తున్నారు. ఇందుకోసం ప్రస్తుతం ఒక్కో సర్పంచ్కు రూ. 10 లక్షల నుంచి రూ. 30 లక్షలకు పైగా అప్పులయ్యాయి. కానీ సర్కారు రైతు వేదికలకు తప్ప ఇతరత్రా బిల్లులు ఇవ్వకపోవడంతో అప్పులవాళ్ల వేధింపులు మొదలయ్యాయి. కొందరు సర్పంచులు అప్పులిచ్చినవాళ్లకు మొహం చూపించలేక ఇండ్ల నుంచి బయటకురావట్లేదు.
రబ్బర్ స్టాంప్గా మారిపోయినం
రాష్ట్రంలో సర్పంచ్లమంతా రబ్బర్ స్టాంపుల్లా మారిపోయినం. మాకు తెలియకుండానే ట్రాక్టర్లు ఇస్తరు. బ్లీచింగ్ పౌడర్ పంపిస్తరు. చెక్కులపై సంతకాలు చేయాలంటరు. చేయకపోతే షోకాజ్ నోటీసులు, సస్పెన్షన్ ఉత్తర్వులు పంపిస్తరు. నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుని మా ఊరి ప్రజలు ఏకగ్రీవ సర్పంచ్గా ఎన్నుకున్నరు. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకంగా రూ. 15 లక్షలు వస్తాయని వాటితో అభివృద్ధి పనులు చేయవచ్చని అనుకున్నా. కానీ రెండేండ్లయితున్నా ఇప్పటి వరకు పైసా రాలేదు.
‒ ఎలిశెట్టి స్వర్ణలత, ఆశిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్, భూపాలపల్లి జిల్లా
ఇలాంటి సర్పంచ్ పదవి ఎందుకు?
మా ఊరు కొత్తగా పంచాయతీ అయింది. గెలిచి రెండేండ్లవుతున్నా ఏం చేయలేకపోయిన. నన్ను ఎన్నుకున్న పబ్లిక్లో ఒక్కరికి కూడా రేషన్ కార్డో, పింఛనో ఇప్పించలేక పోయిన. సర్కారు ఆదేశాలిచ్చిందని ఆఫీసర్లు చెప్పిన పనల్లా చేసుకుంటూ వచ్చిన. బిల్లులు మాత్రం ఇస్తలేరు. వైకుంఠ ధామం, నర్సరీ, హరిత హారం, ట్రీ గార్డులు, ఇంటింటికి రెండు డస్ట్బిన్లు.. ఇలా బిల్లులు వస్తాయన్న నమ్మకంతో అప్పులు తెచ్చి పెట్టిన. ఇప్పటికీ 19 లక్షల 21వేల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నయ్. ఎవరిని అడిగినా రెస్పాన్స్ లేదు. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక పోతున్న. ఇలాంటి సర్పంచ్ పదవి ఎందుకు?
– లోనె భవాని, కిష్టగూడెం సర్పంచ్, జనగామ జిల్లా
బానిసల్లాగ చూస్తున్నరు
టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక సర్పంచులను బానిసల్లాగా చూస్తున్నరు. ప్రజలు ఎన్నుకున్న మాపై ఆఫీసర్లు పెత్తనం చేస్తున్నరు. మమ్మల్ని కాంట్రాక్టర్లుగా మార్చి పనులు చేయిస్తున్నరు. కానీ ఫండ్స్ ఇప్పించట్లేదు. మా ఊరికి వచ్చే నిధులతో ఊరిలో ఎలాంటి అభివృద్ధి పనులు చేసుకోవాలో మేం నిర్ణయించుకోలేనప్పుడు ఇక గ్రామ స్వరాజ్యం అనే మాట ఎందుకు?
‒ నాగుల లక్ష్మారెడ్డి, సూరారం గ్రామ సర్పంచ్, భూపాలపల్లి జిల్లా
Courtesy V6Velugu