మాదిగ సామాజిక వర్గానికి ఒక్క పార్లమెంట్ టికెట్ కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ మొండి చెయ్యి చూపిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ మండిపడ్డారు. మాదిగల రాజకీయ ఉనికిని కాంగ్రెస్ అగ్ర నేతలు ప్రశ్నార్థకం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తీరును వ్యతిరేకిస్తూ బుధవారం నుంచి 10 రోజుల పాటు అన్ని సంఘాలు కలిసి రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కడియం శ్రీహరికి బీఆర్ఎస్ ఏం తక్కువ చేసిందని ప్రశ్నించారు. కడియం శ్రీహరికి విలువల్లేవని, ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి ద్రోహం చేశారని ధ్వజమెత్తారు. ‘‘రాజీనామా చేయకుండా పార్టీ మారే వారిని రాళ్లతో కొట్టి చంపాలని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం కడియం శ్రీహరి ఏ పార్టీ నుంచి ఏ పార్టీలో చేరారు. మరి ఎవరిని రాళ్లతో కొట్టాలి?’’ అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తరువాత మారో మాట మాట్లాడుతున్నారని ఆరోపించారు. కాంగ్రె్సలో మాలలకు ఉన్న గౌరవం, గుర్తింపు తమకు లేదని రుజువైందన్నారు. దీన్ని నిరసిస్తూ గ్రామాలు, మండలాలు, జిల్లా కేంద్రాల్లో పది రోజుల పాటు నిరసన తెలపనున్నట్లు తెలిపారు.